Begin typing your search above and press return to search.

జుక్కల్ ఎమ్మెల్యే vs జర్నలిస్ట్ కేసులో ఊహించని ట్విస్ట్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, శ్యామ్ను ఉప్పర్పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు.

By:  Tupaki Desk   |   24 April 2025 4:42 PM
జుక్కల్ ఎమ్మెల్యే vs జర్నలిస్ట్ కేసులో ఊహించని ట్విస్ట్
X

జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావు ఫిర్యాదు మేరకు బ్లాక్మెయిల్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ప్రజా వాయిస్ న్యూస్ ఛానల్ మేనేజర్ శ్యామ్ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. పోలీసులు కోరిన రిమాండ్ ను కోర్టు తిరస్కరించడంతో అతడు విడుదలయ్యాడు.

ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, తీన్మార్ మల్లన్నతో గతంలో పనిచేసిన రిపోర్టర్ శ్యామ్, నిరూప అనే మహిళతో కలిసి తనను బ్లాక్మెయిల్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. తన ప్రైవేట్ వీడియోలను బయటపెడతానని బెదిరించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో, రాజేంద్రనగర్ పోలీసులు గురువారం సూరారం కృష్ణా నగర్ లోని శ్యామ్ కార్యాలయంలో అతడిని అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, శ్యామ్ను ఉప్పర్పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు.

అయితే, పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ను పరిశీలించిన మెజిస్ట్రేట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నమోదు చేసిన సెక్షన్లకు రిమాండ్ ఎలా ఇస్తారని పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో మెజిస్ట్రేట్ శ్యామ్ రిమాండ్ ను తిరస్కరించారు. అనంతరం, శ్యామ్కు 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నుంచి పంపించివేశారు. ఇది కేసులో కీలక మలుపుగా మారింది.

విడుదలైన అనంతరం ప్రజా వాయిస్ న్యూస్ ఛానల్ మేనేజర్ శ్యామ్ సుందర్ తన వాదనను వినిపించారు. తాను ఎమ్మెల్యేను రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు వస్తున్న ఆరోపణ పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. నిరూపమ అనే మహిళ 2012లో భూమి విషయంలో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు తనకు కోటి రూపాయలు తీసుకొని మోసం చేశారని, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తనను ఆశ్రయించిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లానని, కానీ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. కష్టపడి గెలిచిన ఎమ్మెల్యే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా చూసుకోవాలని మాత్రమే చెప్పానని అన్నారు. ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నాననే ధీమాతో తనపై తప్పుడు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయించారని శ్యామ్ ఆరోపించారు. పోలీసులు కూడా జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ, ఎమ్మెల్యే మాటలు నమ్మి కేసు నమోదు చేశారని, అయితే కోర్టు మెజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయ అండదండలతో వచ్చే ఫిర్యాదుల్లో వాస్తవాలు ఉన్నాయో లేదో పరిశీలించకుండా అమాయక జర్నలిస్టులను వేధించడం సరికాదని హితవు పలికారు.

బాధితురాలు నిరూపమ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. 2012లో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు భూమి వ్యవహారంలో తన వద్ద కోటి రూపాయలు తీసుకుని మోసం చేశారని, దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. తనకు న్యాయం చేయాలని రిపోర్టర్ శ్యామ్ సుందర్ ను ఆశ్రయించానని చెప్పారు. అయితే, ఎమ్మెల్యే రాజకీయ పలుకుబడితో తనపై, శ్యామ్ సుందర్ పై కూడా ఫిర్యాదు చేశారని, టీవీ ఛానల్ లోని కంప్యూటర్లు, లాప్టాప్ లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తీసుకున్న కోటి రూపాయలు తనకు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు.

ఈ కేసులో ఎమ్మెల్యే ఒకవైపు, జర్నలిస్ట్ మరియు ఫిర్యాదుదారు మహిళ మరోవైపు తమ వాదనలు వినిపిస్తున్నారు. కోర్టు రిమాండ్ ను తిరస్కరించడంతో కేసు తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.