Begin typing your search above and press return to search.

మియాపూర్‌లో రహస్య మరణాలు..

ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు.

By:  Tupaki Desk   |   21 Aug 2025 3:32 PM IST
మియాపూర్‌లో రహస్య మరణాలు..
X

ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు. కాసేపటికి లోపల కనిపించిన దృశ్యం అంతా కలచివేసింది. మియాపూర్ మక్త మహబూబ్‌పేట కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందటం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఆ ఇల్లు లోపల విస్తరించిన నిశ్శబ్దం ఒక్కసారిగా భయంకర వాస్తవాన్ని బయటపెట్టింది.

కుటుంబ పెద్ద ఉప్పరి లక్ష్మయ్య (60), ఆయన భార్య వెంకటమ్మ (55), కుమార్తె కవిత (24), అల్లుడు అనిల్ (32), రెండు ఏళ్ల చిన్నారి అప్పు – అందరూ నిర్జీవంగా పడివుండటం చూసి ఆరా తీయడానికి వచ్చినవారు దిగ్భ్రాంతికి గురయ్యారు.

సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు తక్షణమే క్లూస్ టీమ్‌తో చేరుకున్నారు. ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆధారాలు సేకరించారు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం వారిని వెంటాడుతోంది – ఇది ఆత్మహత్యా? లేక పక్కా హత్యా? పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. మరణానికి గల నిజమైన కారణం ఇంకా బయటపడలేదు. అయితే ఆ ఇంటి గోడల మధ్య నడిచిన చివరి క్షణాలు ఎలాంటి వైనమో అనుమానాలు మరింతగా రేకెత్తిస్తున్నాయి.

ఇలాంటి సంఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2025 జనవరిలో బెంగళూరులో టెకీ అనూప్‌కుమార్, భార్య రాఖీ, ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన గుర్తు వస్తోంది. ఆ ఇంటి సహాయకుడు తలుపు తట్టగా లోపల ఎలాంటి స్పందన రాకపోవడంతో బయటపడిన ఆ మర్మకథ అప్పుడు దేశాన్ని కుదిపేసింది. ఇప్పుడీ మియాపూర్ ఘటన వెనక ఉన్న నిజం ఏమిటి? కుటుంబం ఒకేసారి ప్రాణాలు తీసుకున్నదా? లేక మరెవరైనా ఈ నేరాన్ని దాచిపెట్టారా? పోలీసుల దర్యాప్తుతోనే ఆ ఇంటి నిశ్శబ్దం వెనక దాగిన రహస్యాలు వెలుగులోకి రానున్నాయి.