Begin typing your search above and press return to search.

'మిస్ వ‌ర‌ల్డ్‌'.. ఎలా మొద‌లైంది? ఎందుకంత క్రేజ్‌?!

మిస్ వ‌రల్డ్‌.. ప్ర‌పంచ సుంద‌రి పోటీలు ముగిశాయి. తొలిసారి తెలంగాణ రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రం ఈ వేడుక‌ల‌కు ఆతిథ్య‌మిచ్చింది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 9:39 AM IST
మిస్ వ‌ర‌ల్డ్‌.. ఎలా మొద‌లైంది? ఎందుకంత క్రేజ్‌?!
X

మిస్ వ‌రల్డ్‌.. ప్ర‌పంచ సుంద‌రి పోటీలు ముగిశాయి. తొలిసారి తెలంగాణ రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రం ఈ వేడుక‌ల‌కు ఆతిథ్య‌మిచ్చింది. మొత్తంగా 108 దేశాల‌కు చెందిన 40 మంది సుంద‌రీమ‌ణులు ఈ పోటీల్లో ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనేక ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను, సుంద‌రమైన ప్ర‌దేశాల‌ను కూడా క‌లియ దిరిగారు. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో భాగంగా అనేక టెస్టుల‌ను కూడా ఎదుర్కొ న్నారు. మొత్తంగా నెల రోజుల‌పాటు అత్యంత వైభ‌వంగా.. అందంగా.. ఆడంబ‌రంగా జ‌రిగిన ఈ పోటీల్లో థాయ్‌లాండ్ సుంద‌రి కిరీటం ద‌క్కించుకుంది. అయితే.. అస‌లు ఈ `మిస్ వ‌ర‌ల్డ్` పోటీలు ఎలా మొద‌ల‌య్యాయి? ఎప్పుడు మొద‌ల‌య్యాయి? అనేది ఆస‌క్తిక‌రం.

అది 1951, బ్రిట‌న్ రాజ‌ధాని లండ‌న్‌. ఓ రోజు "ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్`` నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా.. యువ‌తుల‌కు స్విమ్ సూట్ పోటీ నిర్వ‌హించారు. దీనిలో ఒక‌రు విజేత అయ్యారు. ఆమె త‌ర్వాత‌.. కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇలా.. మొద‌లైన ఈ పోటీ.. అన‌తి కాలంలోనే వివిధ దేశాల‌కు చెందిన సుంద‌రీ మ‌ణులు పోటీ చేయ‌డం ప్రారంభించారు. తొలి నాళ్ల‌లో ఈ పోటీల‌ను బ్రిట‌న్‌లోనే నిర్వ‌హించేవారు. అయితే.. ప్ర‌పంచ వ్యాప్తంగా పెరిగిన ఆద‌ర‌ణ‌తో.. దీనికి ఒక పేరు ఉండాల‌ని భావించిన నిర్వాహ‌కులు.. `మిస్ వ‌రల్డ్‌` అని నిర్ణ‌యించారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ఈ పోటీల‌ను వివిధ దేశాల్లో నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికీ ఎక్కువ సార్లు నిర్వ‌హించిన దేశంగా బ్రిట‌న్ పేరు చిర‌స్థాయిగా నిలిచింది. వాస్త‌వానికి ఈ పోటీని మొదట ఒకే ఒక ఈవెంట్ అనుకున్నప్పటికీ, ఎక్కువ మంది పాల్గొనడం, భారీగా స్పందన రావ‌డంతో ఏటా నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించారు. ఇక‌, 1951లో జరిగిన మొదటి పోటీలో మిస్ స్వీడన్ కికి హాకాన్సన్ `మిస్ వరల్డ్`(అప్ప‌టికి ఈ టైటిల్ లేదు) గెలిచింది.

వ‌య‌సు నుంచి వ‌న్నె వ‌ర‌కు..

మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో కిరీటం ద‌క్కించుకునే వారిని ప‌క్క‌న పెడితే.. అస‌లు ఈ పోటీల‌కు ప్రారంభ ఘ‌ట్టం నుంచే అనేక ప‌రీక్ష‌లు ఎదుర‌వుతాయి. ప్ర‌తి దేశం నుంచి ఒక్కొక్క‌రిని ఎంపిక చేసే ఈ పోటీలో .. ముందుగా ఆయా దేశాల్లోనే అంత‌ర్గ‌తంగా పోటీలు పెడ‌తారు. వేలాది మంది వీటికి పోటీ ప‌డ‌తారు. వారి నుంచి ఆయా దేశాలు ఒక్క‌రిని ఎంపిక చేయ‌డం ఎంత క‌ష్ట‌మో ఆలోచించుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు భార‌త్ నుంచి ఈ ద‌ఫా నందినీ గుప్తా.. మిస్ వ‌రల్డ్‌లో పాల్గొన్నారు. కానీ, ఆమె ఒక్క‌రే కాదు.. వంద‌ల మందిని ముందుగానే భార‌త్‌లో ప‌రీక్షించి.. చివ‌ర‌కు నందినీ గుప్తాను ఎంపిక చేశారు. ఇలానే.. ఆయా దేశాల్లో చేస్తారు. వ‌య‌సు 27 సంవ‌త్స‌రాల‌కు ఒక్క సెక‌ను కాలం కూడా మించ‌కూడ‌దు.

భౌతిక‌ అందంతోపాటు.. మాన‌సిక అందాన్ని ప్ర‌ధానంగా చూస్తారు. అంతేకాదు.. ఎత్తు 5.2 అడుగుల‌కు వెంట్రుక వాసి కూడా త‌గ్గ‌కూడ‌దు. అంతేకాదు.. ఆమె గ‌తంలో ప్రేమ‌లోనూ ప‌డ‌కూడ‌ద‌ని ఒక నిబంధ‌న ఉంది. వ‌ర్జిన్ అయి ఉండాలి(టెస్టు చేస్తారు). అంతేకాదు.. ఒంటిపై ఎక్క‌డా మ‌చ్చ‌లు మ‌ర‌క‌లు ఉండ‌డానికి వీల్లేదు. నాజూగ్గా ఉండ‌డ‌మేకాదు.. ప్ర‌పంచ జ్ఞానం కూడా ఉండాలి. ఇలా.. అనేక కోణాల్లో ముందుగానే మిస్ వ‌ర‌ల్డ్‌ను ఎంపిక చేస్తారు. ఆ త‌ర్వాత‌.. అస‌లు పోటీకి ఆయా దేశాలు పంపిస్తాయి. ఇక‌, ఇక్క‌డ చివ‌రి ద‌శ వ‌ర‌కు సుమారు 12కు పైగా పోటీలు జ‌రుగుతాయి. ఒక్కొక్క అంచె దాటుకుని వ‌స్తే.. చివ‌రికి మిస్ వ‌రల్డ్ కీర్తి ద‌క్కుతుంది.

కిరీటానికీ ఓ అర్ధం-ప‌ర‌మార్థం..

మిస్ వ‌రల్డ్‌కు ఎంపికైన వారికి అలంక‌రించే కిరీటానికి కూడా అర్ధం ప‌ర‌మార్థం ఉంది. ఇదేమీ తేలిగ్గా అందించేది కాదు. ఊరికేనే పెట్టేది కూడా కాదు. అంతేకాదు.. ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ కిరీటాన్ని ఒకే బ‌రువు, ఒకే ర‌క‌మైన వ‌జ్రాలు, ఒకే సంఖ్య‌లో వ‌జ్రాల‌ను పొదిగి త‌యారు చేస్తారు. మొత్తం 175.49 క్యారెట్ల బరువున్న కిరీటంలో 1,770 మిరుమిట్లు గొలిపే వజ్రాలను పేరుస్తారు. ఈ కిరీటం అద్భుతమైన నీలి నీలమణితో మిరుమిట్లు గొలుపుతుంది. ఇది శాంతి, అవగాహన, స‌ద్భావ‌న‌, విధేయతకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది.

ఎందుకింత క్రేజ్‌?

మిస్ వ‌ర‌ల్డ్‌గా ఎంపికైన వారికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. ఏడాది పాటు సిటిజ‌న్ షిప్ ద‌క్కుతుంది. ఎక్క‌డికి వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగ‌తాలు, అద్భుత‌మైన అతిథి మ‌ర్యాద‌లు. ఇక‌, డ‌బ్బుకు డ‌బ్బు సొంతం. స‌మాజంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద పేరు. జీవితాంతం చిర కీర్తి. అందుకే ఇంత క్రేజ్.