పిక్ ఆఫ్ ది డే : అందగత్తెల 'తెలుగుదనం'
వేయి స్తంభాల గుడి సందర్శన, తెలంగాణ గొప్ప చరిత్ర, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా జరుగుతున్న వారసత్వ పర్యటనలో భాగమే.
By: Tupaki Desk | 14 May 2025 5:43 PMహైదరాబాద్ లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ ఉత్సవంలో పాల్గొంటున్న ప్రపంచ సుందరీమణులు నేడు తెలంగాణలోని చారిత్రక వేయి స్తంభాల గుడిని సందర్శించి, తెలుగు సంప్రదాయంలో ముస్తాబై తెలుగుదనాన్ని చాటిచెప్పారు. సంప్రదాయ తెలుగు చీరకట్టులో మెరిసిపోయిన అందాల రాణులు, ప్రాచీన ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో లీనమయ్యారు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ఈ అందగత్తెలు, ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ పూజలు నిర్వహించి, శివయ్యకు అభిషేకం చేశారు. వేద పండితుల నుండి వేదాశీర్వచనం కూడా అందుకున్నారు.
కాకతీయ శైలి నిర్మాణ అద్భుతమైన ఆలయ కళాఖండాల పట్ల వారు అమితమైన ఆసక్తిని కనబరిచారు. ఆలయ విశిష్టతలను అడిగి తెలుసుకుంటూ, తమ సెల్ ఫోన్లలో ఆలయ అందాలను, శిల్పకళా వైభవాన్ని ఫోటోలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. మిస్ వరల్డ్ సుందరీమణులతో ముచ్చటించిన మంత్రి, తెలంగాణ సంస్కృతి, వారసత్వ గొప్పతనాన్ని వివరించారు.
వేయి స్తంభాల గుడి సందర్శన, తెలంగాణ గొప్ప చరిత్ర, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా జరుగుతున్న వారసత్వ పర్యటనలో భాగమే. ఈ పర్యటనలో భాగంగానే కంటెస్టెంట్లు వరంగల్ కోటతో పాటు మరో బృందం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప ఆలయాన్ని కూడా సందర్శించారు. వేయి స్తంభాల గుడిని సందర్శించిన బృందంలో అమెరికాస్ , కరేబియన్ దేశాల నుండి 22 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.
సంప్రదాయ దుస్తులలో వేయి స్తంభాల గుడిలో మిస్ వరల్డ్ అందగత్తెల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్థానిక సంప్రదాయాలను వారు గౌరవించడం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం పట్ల నెటిజన్ల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. అంతర్జాతీయ గ్లామర్, సంప్రదాయ తెలుగు అందాల కలయికను ఈ చిత్రాలు అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి.