Begin typing your search above and press return to search.

ఏడుపే.. ఏడుపు.. అలా బహిర్గతమైన పెత్తందారీ బుద్దులు!

కట్ చేస్తే... విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం న భూతో న భవిష్యతి అన్నట్లుగా జరిగింది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 10:06 AM GMT
ఏడుపే.. ఏడుపు.. అలా బహిర్గతమైన పెత్తందారీ బుద్దులు!
X

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టీస్ విగ్రహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఒకవర్గం మీడియాకు కన్నుకుట్టినట్లుంది!

ఈ విగ్రహ ఆవిష్కరణ రోజే భారీ ఎత్తున జగన్ పై విమర్శలు కురిపించింది ఆ వర్గం మీడియా. అసలు జగన్ కు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హతే లేదంటూ రాసుకొచ్చింది. దీనికి వైసీపీ నేతలు స్పందించేలోపే... ప్రజానికం సోషల్ మీడియా వేదికగా సమాధానాలు ఇచ్చేసింది. ఎవరు ఎవరిని ఏ స్థాయిలో ప్రేమించారో.. ఎవరు ఏ సామాజికవర్గాల ప్రజలను ఎలా ఆదరించారో.. అంకెలతోనూ, ఉదాహరణల్తోనూ వివరిస్తూ నెట్టింట వైరల్ చేశారు.

కట్ చేస్తే... విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం న భూతో న భవిష్యతి అన్నట్లుగా జరిగింది. 400 కోట్లకు పైగా రూపాయలతో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. తక్కువ సమయంలోనే పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మెటీరియల్ తో విగ్రహ ఏర్పాటు జరిగింది!

కేవలం విగ్రహమే కాకుండా... 18.81 ఎకరాల్లో స్మృతివనం, కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసింది. అవిష్కరణ సభ కూడా ఎంతో ఘనంగా నిర్వహించింది. సభ అనంతరం డ్రోన్ షో విపరీతంగా ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఇలా విజయవాడ నడిబొడ్డున ఈ స్థాయిలో కార్యక్రమం జరిగితే అది ఒక వర్గం మీడియా కంటికి కనిపించలేదు!

రోడ్లపై ఆగిన బస్సులు, ఆ బస్సులకు అడ్డొచ్చిన జనాలు, ఆటోలు మాత్రమే వారికి అగుపించినట్లున్నాయి! అందుకేనేమో... మీడియాలో ప్రసారం చేయకపోగా, కార్యక్రమంపై విమర్శలకు దిగింది ఒక వర్గం మీడియా! సీఎం జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా విషపు కథనాలు వండి వార్చింది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా.. టీడీపీ కరపత్రం మాదిరిగా మారిందనే విమర్శలకు బలం చేకూర్చేలా.. రాతలు రాసింది.

ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆ వర్గం మీడియా ప్రసారం చేయలేదు. "ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన కార్యక్రమం.. ఇది వైసీపీ కార్యక్రమం" అనుకున్నారో ఏమో కానీ... కనీసం ఈ కార్యక్రమాన్ని కాసేపంటే కాసేపు కూడా ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయాయనే విమర్శను సంపాదించుకున్నాయి!

దీంతో ఈ తరహా ప్రవర్తనపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక మహోయోధుడికి సంబందించి కార్యక్రమాన్ని ప్రసారం చేయకపోవడం బహుజనులను అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క ఈనిందంటే పదిసార్లు చూపించే పలు ఛానళ్లు.. పిల్లి పిల్లలను పెట్టిందంటే పదే పదే చూపించే ఒక వర్గం మీడియా.. ఇంతటి చారిత్రక కార్యక్రమం జరుగుతుంటే కనీసం ప్రసారం చేయకపోవడం పెత్తందారీ పోకడలకు నిదర్శనమని అంటున్నారు!

ఏది ఏమైనా... స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టీస్ విగ్రహావిష్కరణ రోజే... పేదలకు - పెత్తందారులకు.. బడుగు బలహీనవర్గాలకు - అగ్రవర్ణ దురహంకారులకు.. స్వఛ్చమైన జ్ఞాన సంపన్నులకు - పరిపూర్ణమైన అజ్ఞాన పీడితులకు మధ్య తేడా స్పష్టంగా కనిపించిందని, చీలిక మరింత స్పష్టంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!