Begin typing your search above and press return to search.

త‌గుదున‌మ్మా అంటూ.. తెలంగాణ‌లో: మాయావ‌తి ఎఫెక్ట్ ఎంత‌?

యూపీ మాజీ సీఎం మాయావ‌తి.. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) త‌ర‌ఫున వ‌రుస‌గా ప్ర‌చారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Nov 2023 11:30 PM GMT
త‌గుదున‌మ్మా అంటూ.. తెలంగాణ‌లో: మాయావ‌తి ఎఫెక్ట్ ఎంత‌?
X

యూపీ మాజీ సీఎం మాయావ‌తి.. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) త‌ర‌ఫున వ‌రుస‌గా ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. అధికార పార్టీ బీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బీఆర్ ఎస్‌ను న‌మ్మొద్ద‌ని.. సీఎం కేసీఆర్‌ను న‌మ్మొద్ద‌ని ఆమె త‌న హిందీ ప్ర‌సంగాల్లో దంచి కొడుతున్నారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని కూడా వ్యాఖ్యానించారు.

పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాయావ‌తి.. బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాయవతి మీడియాతో మాట్లాడుతూ.. "అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే. ప్రవీణ్ కుమార్‌పై బీఆర్ఎస్ పార్టీ కేసులు పెట్టింది. ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశాం. తెలంగాణలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి పంపిణీ చేస్తాం" అనిఅన్నారు.

అయితే.. ఇక్క‌డ ఓ విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. పుట్టిల్లు లాంటి యూపీలో గ‌త 2022లో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో చేతులు ఎత్తేసిన మాయావ‌తి ప‌రోక్షంగా బీజేపీకి స‌హ‌క‌రించారు. తాను కూడా పోటీకి దూరంగా ఉన్నారు. ఇక‌, ఇప్పుడు త‌గుదున‌మ్మా.. అంటూ.. తెలంగాణ‌లో రెడీ అయ్యార‌నే టాక్ వినిపిస్తోంది. అస‌లు తెలంగాణ చ‌రిత్ర‌కానీ, ఇక్క‌డి నేల భాష కానీ.. ఎర‌గ‌ని నాయ‌కురాలు.. ఇప్పుడు అధికారం ఇచ్చేయాల‌ని పిలుపునిస్తుండ‌డం న‌వ్వు తెప్పిస్తోంది.

అయితే.. ఇదంతా వ్యూహం ప్ర‌కారం జ‌రుగుతున్న రాజ‌కీయ క్రీడేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అధికార పార్టీని సాధ్య‌మైనంత వ‌ర‌కు దెబ్బ‌కొట్టాల‌న్న బీజేపీ వ్యూహంలో మాయావ‌తి కూడా చేరిపోయార‌ని.. ఎస్సీ ఓటు బ్యాంకు ను అంతో ఇంతో ప్ర‌భావితం చేయ‌గ‌లిగి.. బీఆర్ ఎస్ కు ఓటు బ్యాంకు త‌గ్గించే ప‌నిలో ప‌డ్డార‌ని అంటున్నారు. మ‌రి మాయావ‌తి ఎఫెక్ట్ ఇక్క‌డ ఎంత ఉంటుందో చూడాలి. ప‌నిలో ప‌నిగా 2019లో ఆమె ఏపీలో జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యాన్ని గుర్తించాల‌ని సూచిస్తున్నారు.