Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ మాస్ వార్నింగ్... "చెప్పు తీద్దామా"...?

ఇందులో భాగంగా... రాజమండ్రిలో జరిగిన సభలో చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎంపీ భరత్. మహిళా వాలంటీర్ ను టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బెదిరించారంటూ ఒక ఆడియో వినిపించారు భరత్

By:  Tupaki Desk   |   5 March 2024 4:56 AM GMT
వైసీపీ ఎంపీ మాస్  వార్నింగ్... చెప్పు తీద్దామా...?
X

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు తీవ్రంగా వేడెక్కుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తిపోతున్నాయి. ఈ సమయంలో గత కొంతకాలంగా చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో వైసీపీ ఎంపీ భరత్ ఆ పనికి పూనుకున్నారు. చెప్పు చూపిస్తూ... భారీ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... కొద్దిరోజుల కిందట జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తన పెళ్లిళ్ల ప్రస్థావన తీసుకురావొద్దని చెప్పు చూపిస్తూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ వ్యవహారంపై స్పందించిన మాజీమంత్రి పేర్ని నాని.. రెండు చెప్పులూ చూపిస్తూ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. నాటి నుంచి ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. పవన్ పై వైసీపీ నేతలు విరుచుకుపడిపోతున్నారు.

ఈ సమయంలో తాజాగా మరోసారి పొలిటికల్ ప్రసంగాల్లో చెప్పు కనిపించింది! ఇందులో భాగంగా... రాజమండ్రిలో జరిగిన సభలో చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎంపీ భరత్. మహిళా వాలంటీర్ ను టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బెదిరించారంటూ ఒక ఆడియో వినిపించారు భరత్. ఈ సందర్భంగా ఇలాంటి వారిని ఏమి చేయాలి అని ఆ సభకు హాజరైన వారిని ప్రశ్నించారు.

అనంతరం తన కాలికున్న చెప్పు తీసి చూపించిన ఆయన... ఇలాంటి వారికి "చెప్పు తీద్దామా.."? అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు!! అనంతరం... వాలంటీర్ అక్కచెల్లెమ్మలను, అన్నదమ్ములను తాను తన సొంత తోడబుట్టినవారిగా చూసుకుంటానని.. వారంతా ప్రజాసేవ చేసే సైనికులని, పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు అని కొనియాడారు. అలాంటి వాలంటీర్లపై బెదిరింపులకు దిగితే రియాక్షన్ గట్టిగా ఉంటుందని అన్నారు!

ఈ లెక్కన చూసుకుంటే... ఈ ఎన్నికల పోలింగ్ రోజు వచ్చే వరకూ... ఏపీ రాజకీయాల్లోని ప్రసంగాల్లో ఎన్ని సార్లు చెప్పులు కనిపిస్తాయో అనే చర్చ తెరపైకి వచ్చింది. కాగా... ఇప్పటికే ప్రతీ సభలోనూ నారా లోకేష్... ఒక కుర్చీని మడతపెట్టి మరీ జగన్ & కో కి వార్నింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ టైపు మాస్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.