అక్కడ ఉన్నది దీదీ... వక్ఫ్ చట్టంపై మోదీకి షాక్ !
ఈ నెల 8వ తేదీ నుంచి దేశమంతా వక్ఫ్ సవరణ చట్టం 2005 అమలులోకి వచ్చిందని కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 10 April 2025 12:30 AMదేశంలో ఇటీవల కాలంలో అతి పెద్ద చర్చగా సాగిన విషయం వక్ఫ్ సవరణ చట్టం 2025. దీనిని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో సెషన్ చివరిలో కేవలం రెండు రోజుల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకుంది. మంచి మెజారిటీతోనే ఉభయ సభలలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. ఆ వెంటనే దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారింది. ఈ నెల 8వ తేదీ నుంచి దేశమంతా వక్ఫ్ సవరణ చట్టం 2005 అమలులోకి వచ్చిందని కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసింది.
అయితే దేశంలో పలు చోట్ల వక్ఫ్ చట్టం అమలు చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం వచ్చినా కూడా అమలులోకి తీసుకుని రావద్దని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోడీ సర్కార్ తీసుకుని వచ్చిన వక్ఫ్ చట్టం మీద షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు
ఇక్కడ ఉన్నది దీదీ నేను నా రాష్ట్రంలో ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోను అని ఆమె ఖండితంగా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ని విభజించి పాలించలేను అని ఆమె చెప్పారు. మైనారిటీలకు తాను అండగా ఉంటాను అని ఆమె హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లో 33 శాతం ముస్లిం లు జీవిస్తున్నారని వారందరి హక్కులను తాను కాపాడుతాను అని ఆమె అంటున్నారు. శతాబ్దాలుగా అంతా ఒక్కటిగా జీవిస్తున్నారని అలాంటిది విభజన రేఖలు గీసి దూరం పెట్టలేమని ఆమె అంటున్నారు. తాను మైనారిటీలను కాపాడడమే కాకుండా వారి హక్కులను సైతం పరిరక్షిస్తామని ఆమె గట్టి భరోసా ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చట్టంగా చేసిన వక్ఫ్ 2025 ని అమలు చేయమని ఒక రాష్ట్రం అంటోంది. అది రాజ్యాంగబద్ధంగా వీలు అవుతుందా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ దేశంలో అందరికీ ఒక్కటే రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేస్తే అది దేశంలో అన్ని చోట్ల అమలు అవ్వాల్సిందే. అలా కనుక జరగకపోతే అది రాజ్యాంగం ఉల్లంఘన గానే చూస్తారు.
ఇక ఈ బిల్లు రాజ్యాంగ బద్ధంగా ఆమోదం పొందింది అని చెప్పాలి. లోక్ సభలో బిల్లు పెడితే 288 మంది సభ్యులు ఔకూలంగా ఓటు వేశారు. రాజ్యసభలో అయితే 128 మంది అనుకూలంగా ఓటు చేస్తే 95 మంది వ్యతిరేకంగా వేశారు. అలా బిల్లు ఆమోదం పొంది రాజ్యంగ అధినేత అయిన రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది.
దానిని అమలు చేయమని చెబితే ఎలా అన్న చర్చ వస్తోంది. అయితే కొంతకాలం పాటు వాయిదా వేయగలరు కానీ అమలు చేయకుండా ఉండలేరని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఇక మమతా బెనర్జీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏమిటి అన్నది చూస్తే కనుక 2026 మే నెలలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. పైగా మూడింట ఒక వంతు ముస్లిం జనాభా ఉంది. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా వారు ఉన్నారు.
దాంతో నాలుగవ సారి సీఎం గా మమత ప్రమాణం చేయాలని చూస్తున్నారు. దానికి ఆమె వక్ఫ్ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని విపక్షాలు అంటున్నాయి. ఇక మమత చేసిన ఈ ప్రకటన తరహాలోనే మిగిలిన బీజేపీయేతర రాష్ట్రాలలో ఎవరైనా అంటారా అన్న చర్చ కూడా ఉంది. అలా కనుక ఇదే తీరుని ఎవరైనా అనుసరిస్తే మాత్రం అది రాజ్యాంగం ప్రకారం ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. నిజానికి ఈ చట్టం మీద ఇప్పటికే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమి చెబుతుందో కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా దీదీ మాత్రం మోదీని ఢీ కొట్టడానికే రెడీ అని చెబుతున్నారని అంటున్నారు.