Begin typing your search above and press return to search.

మ‌జ్లిస్ పార్టీ ఓటు బ్యాంకు డౌన్‌.. క‌ల‌వ‌ర పెడుతున్న ఎన్నిక‌లు

2018లో 2.71 శాతంగా ఉన్న ఎంఐఎం ఓటు బ్యాంకు ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి 2.22శాతానికి ప‌డిపోయింది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 1:13 PM GMT
మ‌జ్లిస్ పార్టీ ఓటు బ్యాంకు డౌన్‌.. క‌ల‌వ‌ర పెడుతున్న ఎన్నిక‌లు
X

హైద‌రాబాద్ ఎంపీ.. అస‌దుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మ‌జ్లిస్ ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐం) పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏడు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. వాస్త‌వానికి ఈ సారి 9 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం.. జూబ్లీహిల్స్‌లో నూ విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని ప్ర‌క‌టించింది. కానీ, అనూహ్యంలో 7 స్థానాల‌కే ప‌రిమితమైంది. 2018లోనూ ఎనిమిది స్థానాల్లో పోటీ ఏడు స్థానాలు గెలిచింది.

ఎంఐఎంకు సంప్ర‌దాయంగా 2009 నుంచి వ‌స్తున్న ఓటు బ్యాంకే ఇప్ప‌టికీ ఉంది. కంచుకోట‌ల వంటి నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి.అ యితే.. ఈ ద‌ఫా.. మాత్రం ఓటుబ్యాంకు తగ్గుముఖం ప‌ట్టింది. సుమారు 0.89 శాతం ఓటు బ్యాంకు తగ్గిపోయింది. 2018లో 2.71 శాతంగా ఉన్న ఎంఐఎం ఓటు బ్యాంకు ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి 2.22శాతానికి ప‌డిపోయింది. మొత్తం 9 నియోజ‌క‌వ‌ర్గాల్లో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎంఐఎం అభ్య‌ర్థుల‌కు 5,19,379 ఓట్లు వ‌చ్చాయి.

అయితే... 2018తో పోల్చుకుంటే.. ఈ ఓట్లు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. అప్ప‌ట్లో 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌గా.. ఆయా అభ్య‌ర్థుల మొత్తం ఓట్లు 5,61,091 ఓట్లు రాగా.. ఇప్పుడు అవి.. 40 వేల దాకా త‌గ్గుముకం ప‌ట్టాయి. యాకుత్‌పురా, నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం అభ్య‌ర్థులు గ‌ట్టిపోటీ ఎదుర్కొనాల్సి రావ‌డం గ‌మ‌నార్హం. ఏకంగా.. యాకుత్పురాలో అయితే.. 878 ఓట్ల‌తో గెలుపుగుర్రం ఎక్కిన ప‌రిస్తితి వ‌చ్చింది.

ఏఐఎంఐఎం అభ్యర్థి జాఫర్‌ హుస్సేన్‌కు 46,153 ఓట్లు రాగా, మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అభ్యర్థి అంజెదుల్లా ఖాన్‌కు 45,275 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన ఎన్.వీరేందర్ బాబు యాదవ్ 22,354తో మూడో స్థానంలో నిలిచారు. ఎంఐఎం అభ్యర్థి అనేక రౌండ్లలో వెనుకంజలో ఉండడంతో ఒక దశలో ఆ పార్టీ సీటు కోల్పోయే పరిస్థితి కనిపించింది. 2018లోనూ ఇదే త‌ర‌హా పోటీ ఉన్నా.. ఎంఐఎం నేత‌ సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రీ 47,000 ఓట్ల మెజారిటీతో సీటును నిలబెట్టుకున్నారు.

ఇక‌, నాంప‌ల్లి విష‌యానికి వ‌స్తే.. అనుకున్నట్టుగానే ఎంఐఎంకు గట్టిపోటీ ఎదురైంది. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, ఎంఐఎం నేత‌ మహమ్మద్ మాజిద్ హుస్సేన్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ ఫిరోజ్ ఖాన్‌పై కేవలం 2,037 ఓట్ల తేడాతో ఎన్నికయ్యారు. మాజిద్ హుస్సేన్ 62,185 ఓట్లు సాధించగా, ఫిరోజ్ ఖాన్ 60,148 ఓట్లు సాధించాడు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ 15,420 ఓట్లు సాధించారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారని అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించిన నేపథ్యంలో నగరం నడిబొడ్డున ఉన్న నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నెలకొంది. ఫిరోజ్ ఖాన్ 2009 నుంచి నాంపల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ రెండో స్థానంలో నిలిచారు.

అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ 81,668 ఓట్ల తేడాతో చాంద్రాయణగుట్ట స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయ‌న‌ 1999 నుండి ఈ స్థానంలో గెలుపొందుతున్నారు. మాజీ మేయర్ మీర్ జుల్ఫేకర్ అలీ చార్మినార్ నుండి బిజెపికి చెందిన ఎం. రాణి అగర్వాల్‌పై 22,000 ఓట్ల తేడాతో ఎన్నికయ్యారు. కౌసర్ మొహియుద్దీన్ కార్వాన్ నుండి బిజెపికి చెందిన అమర్ సింగ్‌పై దాదాపు 42,000 ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు.

మలక్‌పేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి షేక్‌ అక్బర్‌పై ఎంఐఎం నేత అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా 26 వేల ఓట్ల తేడాతో మరోసారి విజయం సాధించారు. ఎంఐఎంకు చెందిన మహ్మద్ ముబీన్ బహదూర్‌పురా నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన మీర్ ఇనాయత్ అలీ బక్రిపై 67,000 ఓట్ల భారీ తేడాతో ఎన్నికయ్యారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం అభ్యర్థి రషీద్‌ ఫరాజుద్దీన్‌ నాలుగో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, కాంగ్రెస్‌ నాయకుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ 16,337 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌పై ఓడిపోయారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో MIM ఓట్ల శాతం బాగా తగ్గింది. ఆ పార్టీ అభ్యర్థి మందగిరి స్వామి యాదవ్ 25,670 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. 2018లో ఆ పార్టీ 46,547 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. బిఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ బిజెపి అభ్యర్థి టి.శ్రీనివాస్ రెడ్డిపై 32,096 ఓట్ల ఆధిక్యంతో సీటును నిలబెట్టుకున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి కె. నరేందర్ మూడో స్థానంలో నిలిచారు. ముబీన్, జుల్ఫెకర్ అలీ, మాజిద్ హుస్సేన్ తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆదివారం అర్థరాత్రి AIMIM ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో పెద్ద వేడుకలు జరిగాయి. అసదుద్దీన్ ఒవైసీ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ వందలాది మంది పార్టీ కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు.