మహానాడు మీద పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్
మహానాడు పండుగ వేళ జనసేన తరఫున తాను శుభాభివందనాలు తెలియచేస్తున్నానని పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
By: Tupaki Desk | 27 May 2025 6:52 PMమహానాడు పేరుతో మూడు రోజుల పార్టీ పండుగను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. అది ఫక్తు తెలుగుదేశం పార్టీ వారి పండుగ. అయితే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం మహానాడుని ప్రశంసిస్తూ గొప్పగా అభివర్ణించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మహానాడు రాజకీయంగా చూస్తే అతి పెద్ద చారిత్రాత్మక సందర్భంగా పేర్కొన్నారు.
మహానాడు అన్న పేరు వింటే టీడీపీ వెంటనే గుర్తుకు వస్తుందని అన్నారు. అంతలా తెలుగు వారి మనసులో టీడీపీ నిలిచిపోయింది అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడుతో మరో దిశా నిర్దేశం చేస్తోంది అన్నారు.
రాయలసీమ గడ్డ మీద కడపలో మహానాడు జరగడం శుభ పరిణామంగా పవన్ పేర్కొన్నారు. మహానాడు పండుగ వేళ జనసేన తరఫున తాను శుభాభివందనాలు తెలియచేస్తున్నానని పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్, తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ నరసింహులకు ఆయన అభినందనలు తెలపడం విశేషం.
ప్రజలు వారి ప్రయోజనాలే అతి ముఖ్యంగా చేసుకుని సాగుతున్న మహనాడులో చర్చిస్తున్న అంశాలు స్ఫూర్తి వంతంగా ఉన్నాయని పవన్ కొనియాడారు. ముఖ్యంగా శ్రీ శక్తి, యువగళం, కార్యకర్తే అధినేత, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్న దాతకు అండ వంటి వాటిపైన కూలంకషంగా చర్చకు మహనాడు ఆస్కారం కల్పించింది అని అన్నారు.
సమాజానికి పనికి వచ్చి అనేక అంశాలను చర్చించి వాటికి తగిన ప్రణాళికలను తయారు చేయాలనుకోవడం ముదావహం అన్నారు. ఇక మహానాడు ప్రాంగణాన్ని సైతం ఆయన వదలలేదు. పసుపు వర్ణంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. మూడు రోజుల మహానాడు పండుగ విజయవంతంగా సాగాలని పవన్ ఆకాంక్షించారు
మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన మిత్ర ధర్మాన్ని ఘనంగా చాటుకున్నారు అని అంటున్నారు. జనసేన ప్లీనరీ విషయానికి వస్తే ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఆ ప్లీనరీని అభినందిస్తూ చంద్రబాబు నాయుడు లోకేష్ ట్వీట్లు చేశారు. విజయవంతం కావాలని ఆకాంక్షించారు అంతే కాదు పవన్ కళ్యాణ్ నిబద్ధతను పార్టీ నిర్వహణ ప్రజల సేవ అప్ట్ల ఆయన కృషిని ప్రశంసిస్తూ వారు ట్వీట్ చేశారు.
దాంతో ఇపుడు పవన్ సైతం అదే స్నేహ ధర్మాన్ని పాటించారు అని అంటున్నారు. కూటమిలో మిత్రులుగా ఉంటూ వేరు పార్టీలకు చెందిన వారు ఇలా ఒకరి పార్టీ కార్యక్రమాల కోసం మరొకరు అభినందించుకోవడం మంచి పరిణామంగా అంతా అంటున్నారు. ఇక బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 6న జరిగితే ఆ సందర్భంగా కూడా టీడీపీ జనసేన అధినేతలు ట్వీట్లు చేసి అభినందించారు.
మొత్తానికి కూటమిలో ఉన్న బలమైన మిత్ర బంధాన్ని ఇవన్నీ సూచిస్తున్నాయని అంటున్నారు. మరో వైపు పవన్ వేసిన ఒక్క ట్వీట్ తో మహానాడు కి హైప్ మరింతగా పెంచేశారు అని అంటున్నారు. సోషల్ మీడియా అది పెద్ద వైరల్ గా మారుతోంది. టీడీపీ తమ్ముళ్ళు కూడా పవన్ ట్వీట్ ని స్వాగతిస్తున్నారు.