Begin typing your search above and press return to search.

హిడ్మాది బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్‌: మావోయిస్టుల బ‌హిరంగ లేఖ‌

అదేవిధంగా విజ‌య‌వాడ‌, కాకినాడ‌, ఏలూరు ప్రాంతాల్లో మ‌కాం వేసిన సుమారు 50 మంది మావోయిస్టుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

By:  Garuda Media   |   21 Nov 2025 7:10 PM IST
హిడ్మాది బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్‌:  మావోయిస్టుల బ‌హిరంగ లేఖ‌
X

మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత‌, గెరిల్లా యుద్ధ‌రీతుల్లో ఆరితేరిన మ‌డ్వి హిడ్మా, ఆయ‌న భార్య రాజేల‌ను అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని మారేడుమిల్లి అట‌వీ ప్రాంతంలో గ‌త మంగ‌ళ‌వారం ఏపీ పోలీసులు ఎదురు కాల్పుల్లో కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. వీరితోపాటు మ‌రో న‌లుగురు, ఆ మ‌రుస‌టి రోజు మ‌రో ఏడుగురిని కూడా ఎదురుకాల్పుల్లో కాల్చి చంపారు. అదేవిధంగా విజ‌య‌వాడ‌, కాకినాడ‌, ఏలూరు ప్రాంతాల్లో మ‌కాం వేసిన సుమారు 50 మంది మావోయిస్టుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప‌రిణామాలు దేశ‌వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి.

అయితే.. హిడ్మా ఎన్ కౌంట‌ర్‌పై ప్ర‌జాసంఘాలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మావోయిస్టు కేంద్ర క‌మిటీ తాజాగా బ‌హిరంగ లేఖ రాసింది. దీనిలో హిడ్మా, ఆయ‌న భార్య రాజేల‌ది బూట‌కపు ఎన్ కౌంట‌ర్ అని లేఖ‌లో ఆరోపించింది. కేంద్ర క‌మిటీ స‌భ్యుడు అభ‌య్ పేరుతో విడుద‌ల చేసిన లేఖ ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ముందుగానే హిడ్మా, ఆయ‌న బృందాన్ని ప‌ట్టుకుని విజ‌య‌వాడ‌కు తీసుకువ‌చ్చార‌ని, అనంత‌రం మారేడుమిల్లికి తీసుకువెళ్లి.. అక్క‌డ నిరాయుధుడిని చేసి హ‌త‌మార్చార‌ని అభ‌య్ పేర్కొన్నారు. ``కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా , కామ్రేడ్ రాజేతో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్ కౌంటర్ కట్టుకథను అల్లారు.`` అని లేఖ‌లో వివ‌రించారు.

``ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు `టెక్` శంకర్ ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్ కౌంటర్ జరిగిందని కట్టుకథను అల్లారు. ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా 'నవంబర్ 23'న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం.`` అని అభ‌య్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కూడా అభ‌య్ కొన్ని విష‌యాల‌ను పంచుకున్నారు. ``దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నది.`` అని పేర్కొన్నారు.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్రకమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా, ఆయ‌న‌ సహచరి కామ్రేడ్ రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోం మినిస్ట్రీ డైరెక్షన్ లో ఆంధ్ర ఎస్ఐబీ నవంబర్ 15వ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారు. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలు.

తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి, ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది.`` అని అభ‌య్ తెలిపారు. వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్రకమిటీ శపథం చేస్తోందన్నారు.