Begin typing your search above and press return to search.

రూ.2100 కోసం అంత దారుణంగా హత్య చేశాడు

మద్యం మత్తులో డబ్బుల కోసం దారుణంగా వ్యవహరించిన లారీ డ్రైవర్ ఉదంతం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   19 Jan 2024 3:55 AM GMT
రూ.2100 కోసం అంత దారుణంగా హత్య చేశాడు
X

మద్యం మత్తులో డబ్బుల కోసం దారుణంగా వ్యవహరించిన లారీ డ్రైవర్ ఉదంతం షాకింగ్ గా మారింది. రూ.2100 కోసం ఒకరిని కిరాతకంగా హత్య చేసిన వైనం కలకలాన్ని రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. మద్యం కొనుగోలు కోసం ఇంత రాక్షసంగా వ్యవహరించటమా? అన్నదిప్పుడు ప్రశ్నగామారింది. అసలేం జరిగిందంటే..

మోత్కురుకు చెందిన 70 ఏళ్ల ఎండీ ఖలీమొద్దీన్ పాతికేళ్లుగా పాత ఇనుప సామాన్లు.. ప్లాస్టిక్ సామాన్లను కొనుగోలు చేసే వ్యాపారం చేస్తున్నాడు. అతనికి భార్యా.. పిల్లల్లేరు. ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లా అమ్మాపురానికి చెందిన కిరణ్ లారీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతగాడు కూడా మోత్కూరులోనే భార్య.. పిల్లలతో జీవిస్తున్నాడు. తాజాగా తన వద్ద ఉన్న పాత ఇనుప సామాన్లను తీసుకొని ఖలీమొద్దీన్ వద్దకు వచ్చిన అతను.. తన వద్ద ఉన్న సామాన్లు అమ్మి రూ.800తీసుకున్నాడు.

అనంతరం మద్యం తాగిన కిరణ్.. ఆ మత్తులో దొంగతనం చేసేందుకు ఖలీమొద్దీన్ షాపుకు వెళ్లాడు. షాపులో నిద్ర పోతున్న ఖలీమొద్దీన్ పై పారతో దాడికి దిగాడు. ఇనుప పారతో అతడి ఎడమ చెవి కింద బలంగా కొట్టిన కిరణ్ అక్కడితో ఆగకుండా.. చనిపోయాడో లేడో అన్న సందేహంతో సుత్తితో చెవి వద్ద మరోరెండుసార్లు బలంగా కొట్టాడు. దీంతో.. అతను అక్కడికక్కడే మరణించాడు. అతడి దగ్గర ఉన్న రూ.2100 చోరీ చేసి వెళ్లిపోయాడు. పోలీసులకు అందిన సమాచారంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. లారీ డ్రైవర్ కిరణ్ కోసం గాలింపు చేపట్టారు.