Begin typing your search above and press return to search.

రూ. వంద కోట్ల పరకా'మనీ దొంగ' వెనుక వైసీపీ నేతలు.. మంత్రి లోకేశ్ హాట్ ట్వీట్

తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారని లోకేశ్ ఆరోపించారు.

By:  Tupaki Desk   |   20 Sept 2025 10:52 PM IST
రూ. వంద కోట్ల పరకామనీ దొంగ వెనుక వైసీపీ నేతలు.. మంత్రి లోకేశ్ హాట్ ట్వీట్
X

టీటీడీపై మరోమారు రాజకీయ దుమారం చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో పరకామణిలో రూ.వంద కోట్లు దోచుకున్నారని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించిన వెంటనే మంత్రి లోకేశ్ రంగంలోకి దిగారు. భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలను సమర్థించిన లోకేశ్.. గత ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. పరకామణిలో అమెరికన్ డాలర్లను దొంగిలించిన వీడియోను భానుప్రకాష్ రెడ్డి మీడియా సమక్షంలో ప్రదర్శించగా, ఆ వీడియోను లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘‘జగన్ హయాంలో తిరుమలలో మహాపచారం.. వైసిపి గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారు. రూ.వంద కోట్ల పరకా'మనీ దొంగ' వెనుక వైసీపీ నేతలు’’ అంటూ లోకేశ్ సుదీర్ఘ ట్వీట్ చేశారు.

‘‘జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్ చేసారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్... చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదలలేదు.’’ అంటూ మంత్రి లోకేశ్ మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారని లోకేశ్ ఆరోపించారు. కోట్ల సొత్తు కొల్లగొట్టారు. ఆ డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టారు. ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారని లోకేశ్ ఆరోపించారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు టిటిడి చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అతని మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి ప్రయత్నించారు.

అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు.’’ అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.

ఏడుకొండలు జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు అని.. అప్పట్లోనే చంద్రబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారని లోకేశ్ వివరించారు. చంద్రబాబు మాట వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ.. అంటూ చిత్తూరు యాసలో పోస్టు చేశారు లోకేశ్. శ్రీవారికి అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసినా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి, గుడిలో హుండీని దోచేసిన పాపాల గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈ రోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారంటూ మంత్రి లోకేశ్ హెచ్చరించారు.