భారత్లో మూడు దాడుల సూత్రధారి హతం.. లష్కర్లో కలకలం!
పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో జరిగిన ఒక సంఘటన లష్కర్-ఎ-తైబా, ఇతర ఉగ్రవాద నెట్వర్క్లలో కలకలం రేపింది.
By: Tupaki Desk | 18 May 2025 5:30 PMపాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో జరిగిన ఒక సంఘటన లష్కర్-ఎ-తైబా, ఇతర ఉగ్రవాద నెట్వర్క్లలో కలకలం రేపింది. లష్కర్-ఎ-తైబా టాప్ కమాండర్ రజావుల్లా నిజామానీ అలియాస్ సైఫుల్లా ఖాలిద్ గుర్తు తెలియని దుండగుల చేతిలో కాల్చి చంపబడ్డాడు. సింధ్ ప్రావిన్స్లోని మట్లి నగరంలోని ఫాల్కారా చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. నిందితులు అతను ఇంటి నుంచి బయలుదేరుతుండగా లక్ష్యంగా చేసుకుని అక్కడికక్కడే హతమార్చారు. అబూ సైఫుల్లా ఖాలిద్ మలన్ ప్రాంతానికి చెందినవాడు. చాలా కాలంగా కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు.
కాశ్మీర్ జిహాద్ నుంచి తిరిగి వచ్చిన తరువాత లష్కర్-ఎ-తైబా అతనికి గాజీ అబూ సైఫుల్లా అనే బిరుదును ఇచ్చింది. అయితే, ఇటీవల సంస్థ అతడిని అప్రమత్తం చేసి అతని కార్యకలాపాలను పరిమితం చేయమని ఆదేశించినట్లు చెబుతారు. అంతేకాకుండా అతనికి భద్రత కూడా కల్పించారు. కానీ అతను మట్లి నగరంలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రోజునే దుండగులు అతని తల, ఛాతీలో కాల్పులు జరిపారు. అబూ సైఫుల్లా భారతదేశంలో లష్కర్ నిర్వహించిన అనేక పెద్ద దాడులకు సూత్రధారి. అతను భారతదేశంలో కనీసం మూడు ఉగ్రవాద దాడుల కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు.
సైఫుల్లా బుర్రలో ఉన్న మూడు దాడులు
* రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్పై దాడి... 2001లో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్పై జరిగిన ఉగ్రవాద దాడి కుట్రను రజావుల్లా నిజామానీ రచించాడు. ఈ దాడిలో ఉగ్రవాదులు భారీగా కాల్పులు జరిపారు. ఇందులో ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. తరువాత దర్యాప్తు సంస్థలు ఈ దాడి ప్రణాళికకు సంబంధించిన పేర్లను వెల్లడించగా, అందులో అబూ సైఫుల్లా అగ్రస్థానంలో ఉన్నాడు.
* బెంగుళూరులో విధ్వంసం... అబూ సైఫుల్లా 2005లో బెంగుళూరులో జరిగిన వరుస పేలుళ్ల కుట్ర కూడా రచించాడు. ఈ పేలుళ్ల వల్ల బెంగుళూరు నగరం దద్దరిల్లింది. ఐటీ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు.
* నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం లక్ష్యం... 2006లో నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక పెద్ద దాడికి ప్రయత్నించారు. అయితే, భద్రతా బలగాలు సకాలంలో ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కానీ ఈ దాడి వెనుక కూడా అబూ సైఫుల్లానే ఉన్నాడని దర్యాప్తులో తేలింది.
లష్కర్ కోసం నియామకాలు, నిధుల బాధ్యత
స్థానిక వర్గాలు, భద్రతా సంస్థల ప్రకారం.. అబూ సైఫుల్లా హత్య ఒక ప్రణాళికాబద్ధమైన లక్షిత హత్యలో భాగం కావచ్చు. అబూ సైఫుల్లా జమ్మూ కాశ్మీర్లో భారతదేశ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించాడు. పాకిస్తాన్కు తిరిగి వచ్చిన తరువాత సింధ్లో జమాత్, లష్కర్ కోసం నియామకాలు, నిధుల సేకరణ వంటి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు.