Begin typing your search above and press return to search.

లాస్ట్ పంచ్ పవన్ దేనట...!

అయితే వీటిని అన్నింటికీ పటాపంచలు చేస్తూ పవన్ సభలు నిర్వహించేందుకు కదులుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:14 PM GMT
లాస్ట్ పంచ్ పవన్ దేనట...!
X

పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. అన్ని పార్టీలూ ప్రచారాన్ని పీక్స్ లోకి తీసుకెళ్లాయి. జనసేన అధినేత రాక ఎపుడు అన్న ప్రశ్నలు ఉన్నాయి. అసలు ప్రచారం చేస్తారా అన్న డౌట్లూ ఉన్నాయి. అయితే వీటిని అన్నింటికీ పటాపంచలు చేస్తూ పవన్ సభలు నిర్వహించేందుకు కదులుతున్నారు. దీని మీద ఒకటి రెండు రెండు రోజులలో అధికార ప్రకటన వెలువడుతుంది అని అంటున్నారు.

పవన్ సభలతో పాటు రోడ్ షోలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లతో పాటు ఖమ్మం జిల్లాల మీద జనసేన ఫుల్ ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. ఆయన బీజేపీకి జనసేనకు కలిపి కంబైండ్ గానే ప్రచారం చేస్తారు అని అంటున్నారు.

పవన్ రోడ్ షోలను భారీగా నిర్వహిస్తారు అని తెలుస్తోంది. అవి గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మంలో కూడా ఉంటాయని అంటున్నారు. అదే విధంగా భారీ ర్యాలీలకు కూడా బీజేపీ జనసేన ప్లాన్ చేస్తున్నాయి. వాటిలో కూడా పవన్ పాల్గొంటున్నారు.

పవన్ వారాహి రధం ఇపుడు అలా కదిలి తెలంగాణా రాజకీయ దారులలో జోరు చేస్తుంది అని అంటున్నారు. నిజానికి పవన్ చాలా రోజుల ముందే ప్రచారం చేపట్టాల్సి ఉంది. అయితే ఎందుకో అది ఆగింది. మధ్యలో అయితే కొందరు పవన్ ప్రచారం ఉండదని కూడా అనుకున్నారు.

కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం పవన్ మీద ఎన్నో ఆశలను పెట్టుకుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ రెండు లక్ష్యాలను సాధించాలని చూస్తోంది. డబుల్ డిజిట్ లో సీట్లను సాధించడమే కాకుండా ఓటింగ్ షేర్ ని బాగా పెంచుకోవాలని భావిస్తోంది.

కనీసంగా పది నుంచి పన్నెండు సీట్లు దక్కినా హోరా హోరీ పోరుగా ఉన్న తెలంగాణా రాజకీయాల్లో తాము కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థీతి ఉంటుందని భావిస్తోంది. నిజానికి కొద్ది నెలల క్రితం వరకూ బీజేపీకి కనీసంగా పాతిక నుంచి ముప్పయి సీట్ల దాకా వస్తాయని అనుకున్నారు.

కానీ కర్నాటక ఎన్నికల తరువాత ఆ గ్రాఫ్ బాగా తగ్గుతూ వస్తోంది. అది కాస్తా ఇపుడు బీజేపీకి అయిదారు సీట్ల దగ్గరనే లాక్ చేసి పారేసింది అని సర్వేలు ఘోషిస్తున్నాయి. అయితే బీజేపీ నేతలు మాత్రం మ్యాజిక్ జరుగుతుందని ధీమాగా ఉన్నాయి. డజన్ సీట్లు సాధించాలని ఇరవై శాతం ఓట్ల షేర్ ని దక్కించుకోవాలని చూస్తున్నాయి.

ఉత్తరాదిన ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మోడీ అమిత్ షా పూర్తి స్థాయిలో రానున్న రోజులలో తెలంగాణాలో తిరుగుతారని అంటున్నారు. దాంతో పవన్ ని కూడా జనంలోకి పంపించి పాజిటివ్ వేవ్ ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

పవన్ సైతం జనసేన అభ్యర్ధులతో పాటు బీజేపీకి కూడా ప్రచారం చేస్తారు. తద్వారా తాను ఎన్డీయే భాగస్వామిని అని నిరూపించుకోనున్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉండే చోటనే పవన్ సభలు ర్యాలీలు రోడ్ షోలు ఉంటాని అంటున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అధికార బీయారెస్ మీద విమర్శలు చేస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. అదే విధంగా కాంగ్రెస్ మీద ఆయన ఘాటు విమర్శలు చేస్తారా అన్నది కూడా అందరిలో ఒక చర్చగా ఉంది. మరి పవన్ వారాహి ఎక్కితే తన పంచులతో ఏ పార్టీకి తలంటుంతారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా పవన్ జనంలోకి వస్తే మాత్రం బీజేపీ జనసేన కాంబోకు మంచి ఊపు వస్తుంది అని భావిస్తున్నారు.