Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నాణెంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. స్పందించిన లక్ష్మీపార్వతి!

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్మారక నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   30 Aug 2023 5:24 AM GMT
ఎన్టీఆర్ నాణెంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. స్పందించిన లక్ష్మీపార్వతి!
X

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్మారక నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై లక్ష్మీ పార్వతి ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికలు వస్తోన్న వేళ తమ స్వార్ధరాజకీయ ప్రయోజనాలకోసం ఎన్టీఆర్ పేరున 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారంటూ వస్తోన్న వార్తలను లక్ష్మీపార్వతి సమర్ధించారు. ఎన్టీఆర్ కు భారతరత్న విషయం పక్కకు తప్పించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పురందేశ్వరి, చంద్రబాబు... ఇద్దరూ మాట్లాడుకునే ఈ నాణెం అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి.. భారతరత్నను పక్కకు తప్పించారని.. ఫలితంగా ఎన్టీఆర్ కు మరోసారి వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో ఎన్టీఆర్ పేరున విడుదల చేసిన 100 రూపాయల క్వాయిన్ ని "చెల్లని నాణెం" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తుంటే ఎంతో బాధగా ఉందని ఆమె అన్నారు. ఎన్టీఆర్ బొమ్మ ఉన్న నాణెం చెల్లని నాణెం అంటూ అంతా ఎగతాలి చేస్తుంటే.. ఎంతో ఆవేదనగా ఉందని చెప్పిన లక్ష్మీపార్వతి... ఎన్టీఆర్ కు వీళ్లు చేసే ఉపకారం ఇదా అని ప్రశ్నించారు.

ఆ నాణెం చెలామణిలో ఉండేది అయితే పర్లేదు కానీ... నాలువేలకు పైగా డబ్బు చెల్లిస్తే ఆ నాణెం ఇస్తారట.. ఆఖరికి ఆయనను ఈ రకంగా కూడా వ్యాపారాన్నికి ఉపయోగిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో ఆ కార్యక్రమానికి హాజరైన బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలపై కూడా లక్ష్మీపార్వతి ఫైరయ్యారు. ముగ్గురు నలుగురు పేర్లు చెప్పిన ఆమె... ఎన్టీఆర్ కు వీళ్లంతా అనుచరులా అని ప్రశ్నించారు. అసలు ఆ కార్యక్రమంలో వీళ్లందరినీ చూస్తుంటే... రాష్ట్రపతి భవన్ కలుషితం అయిపోయిందనే భావన కలిగిందని తెలిపారు.

కాగా... ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఇప్పటికే పురందేశ్వరిపై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఫైరయిన సంగతి తెలిసిందే. తనను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారా లేదా అనే విషయం ఆయన కుటుంబ సభ్యులు చెప్పాలని లక్ష్మీపార్వతి సూటిగా ప్రశ్నించారు.

తమ వివాహంపై అన్ని పత్రికలు రాశాయని.. ఇలా ఇంకా ఎన్నిసార్లు తనను అవమానిస్తారని ఆమె నిలదీశారు. తాను ఎన్టీఆర్ భార్య అని బోర్డ్ కట్టుకుని తిరగలా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తనను ఎన్టీఆర్ ఇల్లిగల్ గా పెట్టుకున్నారా అని కూడా లక్ష్మీపార్వతి అడిగారు. ఒకవేళ తనను ఇల్లీగల్ గా పెట్టుకుంటే... అప్పుడు ఎన్టీఆర్ ఎలా యుగపురుషుడు అవుతాడంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు.