Begin typing your search above and press return to search.

మాజీ కేంద్ర మంత్రి షాక్ ఇస్తారా...?

వైసీపీలో ఉంటే చాన్స్ దక్కదని భావిస్తున్న కృపారాణి షాకింగ్ డెసిషన్ తీసుకుంటే వైసీపీకి ఇది బిగ్ ట్రబుల్ గా మారుతుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Sep 2023 1:30 AM GMT
మాజీ కేంద్ర మంత్రి షాక్ ఇస్తారా...?
X

ఆమె సీనియర్ నాయకురాలు. వృత్తి రిత్యా డాక్టర్. 2004లో డాక్టర్ వైఎస్సార్ డిస్కవరీగా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమె కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి . ఆమె 2004లో శ్రీకాకుళం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓటమిని చూశారు. అయితే 2009లో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో అదే సీటు నుంచి పోటీ చేసి దిగ్గజ నేత, కేంద్ర మంత్రిగా పనిచేసిన కింజరాపు ఎర్రన్నాయుడుని ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు గడించారు. ఆ టెర్మ్ లోనే ఆమెకు కేంద్రలో ఐటీ కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రిగా పదవి లభించింది.

ఇక నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నేతగా 2014లో సైతం ఆమె కాంగ్రెస్ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ టైం లో ఆమెకు వైసీపీ నుంచి టీడీపీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. అయితే తనకు రాజకీయ జన్మ ఇచ్చిన కాంగ్రెస్ ని వీడకూడదని అలా ఆమె పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నారు. ఇదిలా ఉంటే ఆమె 2018లో మాత్రం తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా వైసీపీలో చేరారు.

ఆమె ఆ టైం లో శ్రీకాకుళం ఎంపీ సీటుని ఆశించారు. ఆమెకు టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉండేవేమో కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం పార్టీ కోసం పనిచేయమని చెప్పింది. ఆ సీటు నుంచి దువ్వాడ శ్రీనివాస్ ని పోటీకి నిలిపింది. ఆయన ఓటమి పాలు అయ్యారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక నామినేట్ పదవి ఇస్తారని ఆమె ఎదురుచూసారు.

అయితే ఆమెను మూడేళ్ల పాటు శ్రీకాకుళం వైసీపీ ప్రెసిడెంట్ పదవిలో ఉంచారు. ఆమె రాజ్యసభ సీటుని ఆశించారని ప్రచారం సాగింది. కానీ అది దక్కలేదు. దాంతో ఆమె ఒకింత నిరాశకు గురి అయ్యారని అంటారు. ఇక టెక్కలి ఆమె సొంత అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే మొదట్లో దువ్వాడ శ్రీనుకు, ఆ తరువాత ఆయన సతీమణి వాణికి ఇంచార్జి బాధ్యతలను పార్టీ అప్పగించింది.

ఇక వచ్చే ఎన్నికల్లఒ శ్రీకాకుళం ఎంపీ సీటు విషయంలో కూడా ఆమెకు ఆశలు ఉన్నాయని అంటున్నారు. కానీ ఈ సీటుని శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ దానేటి శ్రీధర్ కి ఇప్పించాలని ధర్మాన సోదరులు ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. దాంతో కిల్లి కృపారాణి కొత్త ఆలోచనలు చేస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది.

ఆమె వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని చూస్తూంటే టీడీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం అయితే సాగుతోంది. సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ ని అసెంబ్లీకి పోటీ చేయడానికి పంపించి ఎంపీ సీటుకు గట్టి అభ్యర్ధిని నిలబెట్టాలని టీడీపీ చూస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా కాపులు, కాళింగులు , వెలమలు బలమైన సామాజికవర్గాలుగా ఉన్నారు. ఇక వైసీపీ వెలమలకు పెద్ద పీట వేస్తుందన్న విమర్శలు ఉన్నాయి

దాన్ని రూపుమాపుకునేందుకు కాళింగ సామాజికవర్గానికి చెందిన కిల్లి కృపారాణికి పార్టీలోకి తీసుకుని ఎంపీ అభ్యర్ధిగా పంపించాలని చూస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. దీని వల్ల జిల్లాలో ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్న కాళింగ సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవచ్చునని టీడీపీ అంచనా వేసుకుంటోంది. అదే టైం లో మరోసారి సిక్కోలు ఎంపీ సీటు గెలిచి వైసీపీకి దెబ్బ కొట్టాలని చూస్తోంది.

ఇక కృపారాణి విషయానికి వస్తే ఆమెకు రాజకీయంగా అవకాశాలు రానీయకుండా శ్రీకాకుళం జిల్లాలో ఒక మంత్రి అడ్డుపడుతున్నారని ఆమె వర్గం అనుమానిస్తోంది. రాజ్యసభ సీటు కూడా చివరి నిముషంలో చేజారింది. వైసీపీలో ఉంటే చాన్స్ దక్కదని భావిస్తున్న కృపారాణి షాకింగ్ డెసిషన్ తీసుకుంటే వైసీపీకి ఇది బిగ్ ట్రబుల్ గా మారుతుంది అని అంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.