Begin typing your search above and press return to search.

తీరు మార్చని కృష్ణంరాజుకు జాతీయ మహిళా కమిషన్ షాక్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Jun 2025 9:45 AM
తీరు మార్చని కృష్ణంరాజుకు జాతీయ మహిళా కమిషన్ షాక్..!
X

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. మహిళలను అనవసరంగా అవమానించడమే కాకుండా.. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం ద్వారా ఆయన మరింత సమస్యల మధ్య చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్వయంగా సుమోటోగా కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రాహత్కర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాసి.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, అలాంటి మహిళలను ఈ విధంగా అవమానించడాన్ని సహించలేమని ఎన్సీడబ్ల్యూ తీవ్రంగా మండిపడింది.

ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ కూడా స్పందించారు. అమరావతిపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. "కులం, మతం పేరు చెప్పి రాజధానిని విమర్శించడం అర్ధరహితమైన పని. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టును ఉద్ధేశించి మాట్లాడినట్టు కొందరు చెబుతున్నా.. ఆ రిపోర్టులో అమరావతి పేరు ఎక్కడా లేదు" అని ఆమె స్పష్టం చేశారు.

ఈ వివాదంలో మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఆ రోజు డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తగిన సమాచారం లేకుండానే ఇలాంటి సున్నితమైన విషయాన్ని చర్చకు తీసుకురావడం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. "అమరావతి మహిళలు ఏ తప్పూ చేయలేదు. వాళ్ల తప్పేమిటంటే రాజధానిగా దానం చేయడమా?" అంటూ రాయపాటి శైలజ మండిపడ్డారు. మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం భావప్రకటన స్వేచ్ఛ కింద రాదు అని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. కృష్ణంరాజు తన వ్యాఖ్యలకు మద్దతుగా పాత వార్తా కథనాలను చూపిస్తూ తప్పదిదే అనడం మరింత వ్యతిరేకతను రేకెత్తిస్తోంది. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. కృష్ణంరాజును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ వివాదం యావత్ మహిళా సంఘాలను, సామాజిక వర్గాలను తీవ్ర అసహనానికి గురిచేస్తూ.. మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పౌరసమాజం కోరుకుంటోంది.ఇక అధికారులు, పోలీసు శాఖ, మహిళా కమిషన్ల నుండి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి!