Begin typing your search above and press return to search.

నేను అమాయ‌కుడిని..కేసులు కొట్టేయండి: కృష్ణంరాజు

''నేను అమాయకుడిని. నాపై అన్యాయంగా కేసులు నమోదు చేశారు''- అంటూ సీనియర్ జర్నలిస్టు, రాజధాని అమరావతి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:46 AM IST
నేను అమాయ‌కుడిని..కేసులు కొట్టేయండి:  కృష్ణంరాజు
X

''నేను అమాయకుడిని. నాపై అన్యాయంగా కేసులు నమోదు చేశారు''- అంటూ సీనియర్ జర్నలిస్టు, రాజధాని అమరావతి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. ఈ నెల 6న సాక్షి ఛానల్ లో నిర్వహించిన డిబేట్లో అమరావతిని వేశ్యల రాజధానితో పోలుస్తూ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. రాజధాని మహిళలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మహిళలు ఉద్యమించారు. సాక్షి కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. నిరసన తెలిపారు.

ఈ క్రమంలో రాజధాని ప్రాంతానికి చెందిన మాదిగ కార్పొరేషన్ చైర్ ప‌ర్సన్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో ఏ1 నిందితుడిగా కృష్ణంరాజును పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వస్తున్న సమయంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పోలీసులు కేసులు నమోదు చేశారని పేర్కొంటూ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ వెలుగు చూసింది.

రాష్ట్రంలో సెక్స్ వర్కర్లు పెరిగిపోయారని ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా తాను వ్యాఖ్యలు చేశానని, రాజధాని మహిళలను కానీ రాష్ట్రంలోని మహిళలను కానీ అవమానించే ఉద్దేశం, విమర్శించే ఉద్దేశం తనకు లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లో భాగంగానే తాను పలు ఛానల్లో విశ్లేషణలు చేస్తుంటానని, జర్నలిజం విలువలకు కట్టుబడి తాను సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నాన‌ని పిటిషన్ లో వివరించారు. ఇదే సమయంలో మంగళగిరి కోర్టు తనపై నమోదు చేసిన కేసుల విషయంలో పోలీసులను నిలదీసినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ లను నమోదు చేయడానికి మంగళగిరి కోర్టు తప్పు పట్టిందని, వాటిని తక్షణం తొలగించాలని పోలీసులను ఆదేశించిందని, దీంతో తనపై నమోదు చేసిన సెక్షన్లను తొలగించారని హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో కృష్ణంరాజు వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. భావ ప్రకటన, పాత్రికేయ పరమైన విలువలను కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అనేక తీర్పులు ఇచ్చిందని వాటిని పరిగణనలోకి తీసుకొని తనపై నమోదైన అన్ని కేసులను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు.

ఇవన్నీ రాజకీయ కక్షపూరితంగా నమోదైన కేసులేనని, తనపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కాదా దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు మూడు రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును శనివారం రాత్రి 11 వరకు విచారించారు. అయితే ఏ ప్రశ్న అడిగినా తను మరిచిపోయానని, గుర్తు లేదని కృష్ణంరాజు చెప్పినట్టు దర్యాప్తు అధికారి మీడియాకు వెల్లడించారు.

ముఖ్యంగా బ్యాంకు ఖాతాల్లో విరివిగా సొమ్ములు రావడం, దేశ విదేశీ అకౌంట్ల నుంచి కూడా నిధులు జమ కావడంపై ప్రశ్నించినట్టు చెప్పారు. అయితే ఆ వివరాలు ఏవీ తనకు తెలియదని తాను మరిచిపోయానని కృష్ణంరాజు చెప్పినట్టు తెలిపారు. న్యాయవాది సమక్షంలో విచారిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారంతో కృష్ణంరాజు కస్టడీ ముగుస్తుందని తెలిపారు.