Begin typing your search above and press return to search.

లోకేష్ ఆద‌ర్శం.. ఒకే సారి 339 ప‌నులు: ఎమ్మెల్యే

ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 May 2025 11:38 AM
లోకేష్ ఆద‌ర్శం.. ఒకే సారి 339 ప‌నులు: ఎమ్మెల్యే
X

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి మ‌రో రికార్డును సొంతం చేసుకున్నారు. త‌న నియోజ‌క వ‌ర్గంలో దూకుడుగా ఉంటున్నార‌న్న పేరు తెచ్చుకున్న ఆయ‌న‌.. తాజాగా ఏక‌కాలంలో 339 అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్ల వ్యయంతో ఈ ప‌నులు చేప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.

ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవం చేయించేందుకు కోటంరెడ్డి రెడీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. త‌న‌కు మం త్రి నారా లోకేష్ ఆద‌ర్శ‌మ‌ని చెప్పుకొచ్చారు. నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ.. ప‌నులు చేస్తున్న నారా లోకేష్ ను ఆద‌ర్శంగా తీసుకుని ప‌నులు చేప‌ట్టిన‌ట్టు ఆయ‌న తెలిపారు. అంతేకాదు.. పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స హించేందుకు వారితోనే ఆయా ప‌నుల‌ను ప్రారంభిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

కొన్ని రోజుల కింద‌ట‌.. స‌ద‌రు ప‌నుల‌కు సంబంధించి.. సీఎం చంద్ర‌బాబును క‌లిసిన కోటంరెడ్డి.. ఆయ‌న ను ఆహ్వానించారు. అయితే.. ప‌నిఒత్తిడి కార‌ణంగా తాను రాలేన‌ని.. స్వ‌యంగా ప్రారంభించాల‌ని చంద్ర బాబు తేల్చి చెప్పారు. దీంతో కార్య‌క‌ర్త‌ల‌తోనే ఆయా అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించేలా ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 339 ప‌నుల‌ను ప్రారంభించేందుకు నిర్ణ‌యించుకు న్నారు. దీనిని అట్ట‌హాసంగా నిర్వ‌హిస్తుండ‌డం మ‌రో విశేషం.

గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు వైసీపీలోనే ఉన్న కోటంరెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి టీడీపీ జెండాపై ఆయ‌న పోటీ చేసి విజ‌యం కూడా ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌త రెండు ద‌శాబ్దాల్లో ఇదే ప్ర‌థ‌మం. పైగా.. పార్టీ అధికారంలోకి రావ‌డంతో నిధులు మంజూరు చేయించుకుని కోటంరెడ్డి ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప‌నులు దాదాపు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే మూఢం రానున్న నేప‌థ్యంలో ఈ ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు చేప‌ట్టారు.