కొమ్మినేని, కృష్ణంరాజు కేసు.. వైసీపీ సేఫ్ గా బయటపడేదెలా?
జర్నలిస్టు కొమ్మినేని, ఎనలిస్టు కృష్ణంరాజు కేసు విపక్ష వైసీపీకి తలనొప్పిగా మారిందా? అన్న చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 11 Jun 2025 3:30 PMజర్నలిస్టు కొమ్మినేని, ఎనలిస్టు కృష్ణంరాజు కేసు విపక్ష వైసీపీకి తలనొప్పిగా మారిందా? అన్న చర్చ జరుగుతోంది. సాక్షి డిబేట్ లో ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఫలితం వైసీపీ మోయాల్సిరావడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షి మీడియా మాజీ సీఎం జగన్ సొంత చానల్ కావడంతో సాక్షిలో ఏ కంటెంట్ వచ్చినా, అది జగన్ వాయిస్ గానే పరిగణిస్తారని అంటున్నారు. అయితే సాక్షికి సంబంధం లేని విజయవాడ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల ప్రభావంతో ఆ పార్టీకి అనుకోని కష్టం ఎదురవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో తమ గొంతు బలంగా వినిపించడానికి సొంత మీడియా ఉండాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి భావించారు. ఆయన ఆలోచనల మేరకే మాజీ సీఎం జగన్ రాజకీయాల్లోకి రాకముందు సాక్షి స్థాపించిన విషయం తెలిసిందే. తెలుగులో అనతికాలంలోనే ప్రముఖ మీడియా సంస్థగా ఎదిగిన సాక్షిలో ఎందరో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అదేసమయంలో ఆ మీడియా చర్చా కార్యక్రమాల్లో పలువురు నేతలు, జర్నలిస్టులు, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొంటారు. అయితే ఇలాంటి చర్చల్లో జరిగే సంభాషణల ప్రభావం వైసీపీపై పడటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
సాక్షి చర్చలో పాల్గొన్న నిందితుడు కృష్ణంరాజు అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలను సాక్షి ఖండించినా, ఆయన వ్యాఖ్యలతో వైసీపీకి తీవ్ర నష్టం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ చాలా నష్టపోయింది. ఆ డామేజ్ ను కంట్రోల్ చేయడానికి పార్టీపరంగా రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. తమ అభిప్రాయం సవరించుకునే అవకాశం ఉందని గతంలో సీనియర్ నేత బొత్స వ్యాఖ్యానించగా, నాగార్జున వర్సిటీ వద్ద 500 ఎకరాల్లో కొత్త భవనాలు నిర్మిస్తే సరిపోతుంది కదా అంటూ ఆ మధ్య మాజీ సీఎం జగన్ కూడా వ్యాఖ్యానించారు.
అంటే అమరావతిపై తమ ఆలోచన మారుతుందనే సంకేతాలను నెమ్మదిగా అమలులోకి తేవాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇది గమనించని కొందరు అధినేత ఆశీస్సులు పొందాలనే ఉత్సాహంతో అనాలోచితంగా మాట్లాడుతున్నారని, తీవ్ర నష్టం చేస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. ప్రస్తుతం సాక్షి డిబేట్ తర్వాత జరుగుతున్న రచ్చ పార్టీకి శ్రేయస్కరం కాదన్న ఆలోచనతో నష్ట నివారణకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారంటున్నారు. అందులో భాగంగా పార్టీకి కృష్ణంరాజు వ్యాఖ్యలకి సంబంధం లేదని చెప్పడంతోపాటు ఈ వివాదం నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నారని అంటున్నారు.
రాష్ట్ర ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే అంశం కావడంతో పార్టీలోని పెద్దలు రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. రాజకీయంగా ప్రజల మూడ్ ను గమనించి నడుచుకోవాల్సిన ఇటువంటి సమయంలో సీనియర్ నేతలు బొత్స, ధర్మాన వంటివారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కృష్ణంరాజు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్న వాయిస్ తోపాటు కృష్ణంరాజుకు వైసీపీకి కూడా ఎలాంటి సంబంధం లేదన్న అంశాన్ని ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాలని కార్యకర్తలు సూచిస్తున్నారు.