కోహినూర్ వజ్రం భారత్కు తిరిగి వస్తుందా..?
బ్రిటన్ మహారాణి కిరిటంలో శోభాయమానంగా వెలిగిపోతున్న కోహినూర్ వజ్రం విషయంలో చాలా కాలంగా భారత్ వైపు నుంచి ఒక ఆకాంక్ష వ్యక్తమవుతోంది దానిని తిరిగి భారత్కు అప్పగించాలనేది.
By: Tupaki Desk | 5 May 2025 4:00 AM ISTబ్రిటన్ మహారాణి కిరిటంలో శోభాయమానంగా వెలిగిపోతున్న కోహినూర్ వజ్రం విషయంలో చాలా కాలంగా భారత్ వైపు నుంచి ఒక ఆకాంక్ష వ్యక్తమవుతోంది దానిని తిరిగి భారత్కు అప్పగించాలనేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రి లీసా నాండీ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కోహినూర్ను తిరిగి భారత్కు ఇచ్చేస్తారా? అన్న ప్రశ్నకు ఆమె నేరుగా బదులివ్వకుండా, భారత్, బ్రిటన్ మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపారు. అన్నీ సానుకూలంగా జరిగితే.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావొచ్చని ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇదే అంశంపై తాను భారత్ సాంస్కృతిక శాఖ మంత్రితోనూ చర్చించినట్లు లీసా నాండీ ధృవీకరించారు. అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం దిల్లీ చేరుకున్న ఆమె, సాంస్కృతిక శాఖకు సంబంధించిన పలు ఒప్పందాల గురించి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో చర్చలు జరుపుతున్నారు.
తన పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ సృజనాత్మకత, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో భారత్లో దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు లీసా నాండీ తెలిపారు. ‘‘ సినిమా, టీవీ, మ్యూజిక్, క్రీడా రంగాల్లో బ్రిటన్ దూసుకుపోతోంది. ఆయా రంగాలకు సంబంధించిన బ్రిటన్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. భారత్ సహకరిస్తే.. వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ల వచ్చన్న గట్టి నమ్మకం మాకుంది. అందుకు భారత్ కూడా మద్దతిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడిపైనా లీసా నాండీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, ఉగ్రవాదం నిర్మూలనకు ప్రపంచదేశాలన్నీ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
కాగా, భారత్కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో అప్పటి మహారాజ్ దులీప్ సింగ్.. విక్టోరియా మహారాణికి అప్పగించారు. అప్పటి నుంచి ఆ వజ్రం బ్రిటిష్ రాజకుటుంబం ఆధీనంలోనే ఉంది. రాణి కిరీటంలో అమర్చబడిన ఈ వజ్రాన్ని తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం పలుమార్లు దౌత్యమార్గాల్లో ప్రయత్నించినప్పటికీ.. ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో, బ్రిటన్ మంత్రి లీసా నాండీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
