Begin typing your search above and press return to search.

రాహుల్‌ గాంధీతో కోదండరాం భేటీలో కీలక అంశాలివే!

ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీని కరీంనగర్‌ వీపార్క్‌ హోటల్‌ లో కోదండరాం కలిశారు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 10:45 AM GMT
రాహుల్‌ గాంధీతో కోదండరాం భేటీలో కీలక అంశాలివే!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్‌ 30న ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్‌ 3న ఫలితాల వెల్లడికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు కమ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం భేటీ అయ్యారు.

ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీని కరీంనగర్‌ వీపార్క్‌ హోటల్‌ లో కోదండరాం కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ కోదండరాంను రాహుల్‌:గాంధీ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనను రాహుల్‌ కోరగా.. పోటీకి ఆసక్తి లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది.

ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో అవగాహన, బీఆర్‌ఎస్‌ ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్, కోదండరాంల మధ్య చర్చ జరిగినట్టు చెబుతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని కోదండరాం ఆకాంక్షించారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని జన సమితి నిర్ణయించిందని సమాచారం. పొత్తులో భాగంగా ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్‌ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ నియంత పాలన దించడానికే టీజేఎస్‌ ఏర్పడిందని కోదండరాం.. రాహుల్‌ కు వెల్లడించారు. ఈ భేటీలో కేసీ వేణుగోపాల్, పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని కోదండరాం పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్లలో సీట్లు అడుగుతామని వెల్లడించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్‌ స్థానాల్లో రెండు మూడు సీట్లను తెలంగాణ జనసమితి ఆశిస్తోంది.