Begin typing your search above and press return to search.

హ్యాకర్ల దాడికి 158 ఏళ్ల కంపెనీ బలి

ఒక చిన్న పొరపాటు ఎంతటి విపత్తుకు దారితీస్తుందో యూకేకు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ KNP గ్రూప్ ఉదంతం మరోసారి స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   22 July 2025 12:33 PM IST
హ్యాకర్ల దాడికి 158 ఏళ్ల కంపెనీ బలి
X

ఒక చిన్న పొరపాటు ఎంతటి విపత్తుకు దారితీస్తుందో యూకేకు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ KNP గ్రూప్ ఉదంతం మరోసారి స్పష్టం చేసింది. దాదాపు 158 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థ, ఇటీవల జరిగిన భయంకరమైన సైబర్‌ దాడి కారణంగా పూర్తిగా మూతపడింది. ఈ ఘటన వల్ల 700 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి వీధిన పడటం, అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

-శక్తివంతమైన బ్రాండ్ పతనం

యూకేలో KNP లాజిస్టిక్స్ ఒక విశ్వసనీయమైన రవాణా సంస్థగా పేరుగాంచింది. సుమారు 500 ట్రక్కులను 'ది నైట్స్ ఆఫ్ ఓల్డ్' పేరుతో నిర్వహిస్తూ, రవాణా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ సంస్థకు సైబర్ బీమా ఉన్నప్పటికీ, అకిరా గ్యాంగ్ దాడి నుంచి రక్షణ పొందలేకపోయింది.

- అకిరా గ్యాంగ్ దాడి.. డేటా బందీ

ప్రసిద్ధ 'అకిరా' హ్యాకింగ్ గ్యాంగ్ KNP సిస్టమ్‌లలోకి చొరబడి, సంస్థ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసింది. దీంతో ఉద్యోగులు తమ సిస్టమ్‌లను యాక్సెస్ చేయలేక, పనిని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. హ్యాకర్లు డేటాను తిరిగి ఇవ్వడానికి భారీ మొత్తంలో రాన్సమ్‌ ధనం డిమాండ్ చేశారు. "మీరు ఇది చదువుతున్నారంటే, మీ అంతర్గత సమాచారం నాశనం అయిందని అర్థం. కన్నీళ్లు మింగుకొని చర్చలకు సిద్ధమవ్వండి" అంటూ హ్యాకర్లు బెదిరింపు సందేశం పంపారు. నిపుణుల అంచనా ప్రకారం.. హ్యాకర్లు దాదాపు 5 మిలియన్ పౌండ్లు (రూ. 58 కోట్లు) డిమాండ్ చేసి ఉండవచ్చు. అయితే, ఇంత భారీ మొత్తాన్ని చెల్లించలేకపోయిన KNP గ్రూప్ చివరకు మూతపడాల్సి వచ్చింది.

-సైబర్ భద్రతపై ప్రశ్నలు

KNP డైరెక్టర్ పాల్ అబాట్ ప్రకారం, హ్యాకర్లు ఉద్యోగుల లాగిన్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించి సిస్టమ్‌లలోకి ప్రవేశించినట్లు తేలింది. అయితే, ఏ ఉద్యోగి వివరాల ద్వారా ఇది జరిగిందో మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనపై స్పందించిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC) సీఈవో రిచర్డ్ హోర్నె "ఈ డిజిటల్ యుగంలో వ్యాపారాలు సురక్షితంగా ఉండాలంటే, తమ సిస్టమ్‌లను మరింత పటిష్టంగా, భద్రత కలిగిన విధంగా రూపొందించాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.

ఇలాంటి సైబర్ దాడులకు గతంలో యూకేలోని ఎం అండ్ ఎస్, కో-ఆప్, హారోడ్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు కూడా బలయ్యాయి. కో-ఆప్ సంస్థలో అయితే 6.5 మిలియన్ల మంది కస్టమర్ల డేటా దొంగిలించబడింది. ఈ దురదృష్టకర సంఘటన మరోసారి సైబర్ భద్రత యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి గుర్తుచేసింది. డిజిటల్ ప్రపంచంలో, ఒక చిన్న పాస్‌వర్డ్ లోపం కూడా వందలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేయగలదని స్పష్టమవుతోంది. 158 సంవత్సరాలుగా నిలబడిన ఒక సంస్థను ఒక్క దెబ్బతో నేలకూల్చిన ఈ హ్యాకర్ల దాడి, ఇప్పుడు అంతర్జాతీయంగా కొత్త హెచ్చరికగా మారింది.