పర్యాటకులను చంపేందుకు 22 గంటల పాటు కఠోర ట్రెక్కింగ్
జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడి యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
By: Tupaki Desk | 27 April 2025 4:49 PMజమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడి యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మారణహోమంపై భద్రతా దళాలు, దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారణ జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల ఘోరమైన ప్రణాళికకు సంబంధించిన అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజా దర్యాప్తు వివరాల ప్రకారం.. పర్యాటకులను హతమార్చేందుకు ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రణాళిక రచించారు. తమ లక్ష్యాన్ని ఛేదించేందుకు వారు ఏకంగా దాదాపు 22 గంటల పాటు దట్టమైన అడవుల గుండా, కఠినమైన మార్గాల్లో ట్రెక్కింగ్ చేసినట్లు గుర్తించారు. కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలి నడకన ప్రయాణించి, పహల్గాంకు చేరుకున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఇది వారి దాడికి ఎంతగా సన్నద్ధమయ్యారో తెలియజేస్తుంది.
ఈ దారుణ దాడిలో ఉగ్రవాదులు 25 మందికి పైగా పురుషులను లక్ష్యంగా చేసుకుని అతి కిరాతకంగా హత్య చేశారు. దాడి సమయంలో ఉగ్రవాదులు ఒక స్థానిక వ్యక్తితో పాటు, ఒక పర్యాటకుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లను దొంగలించినట్లు కూడా సమాచారం అందింది.
ఈ మారణహోమంలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు విదేశీయులు కాగా, మరొకరు స్థానిక ఉగ్రవాదిగా ఆదిల్ థోకర్ గా గుర్తించారు. ఆదిల్ అనంత్నాగ్ జిల్లాలోని బిజ్బెహారా సమీపంలోని గురీ అనే చిన్న గ్రామానికి చెందినవాడు. టీనేజ్లోనే పలు నిషేధిత ఉగ్ర సంస్థలకు దగ్గరైనట్లు దర్యాప్తులో తేలింది. 2018లో దక్షిణ కశ్మీర్లో జరిగిన ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో పాల్గొన్న ఆదిల్.. అదే ఏడాది విద్యార్థి వీసాపై పాకిస్తాన్కు వెళ్లి వాఘా సరిహద్దు దాటాడు. విచారకరంగా, పాకిస్తాన్లో శిక్షణ పొంది ఉగ్రవాదిగా మారి, సొంతగడ్డపైనే ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డాడు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పహల్గాం ఘటనపై ఎన్ఐఏ బృందాలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. ఈ విచారణలో భాగంగానే ఉగ్రవాదులు దాడికి ముందు వేసుకున్న పక్కా పథకాలకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉన్న పూర్తి కుట్రను ఛేదించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.