Begin typing your search above and press return to search.

''ప్ర‌జ‌లు అత్యాస‌కు పోయిన్రు.. కాంగ్రెస్‌ను గెలిపించిన్రు''

‘‘కొన్ని సందర్భాల్లో అత్యాశకో, దురాశకో పోయి ప్రజలు మోసపోతరు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు

By:  Tupaki Desk   |   12 March 2024 6:18 PM GMT
ప్ర‌జ‌లు అత్యాస‌కు పోయిన్రు.. కాంగ్రెస్‌ను గెలిపించిన్రు
X

''తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అత్యాస‌కు పోయిన్రు.. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన్రు. ఇది రేవంత్ బ‌లం కాదు. కాంగ్రెస్ బ‌లం కూడా కాదు'' అని మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కరీంగనర్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కదనభేరి భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

‘‘కొన్ని సందర్భాల్లో అత్యాశకో, దురాశకో పోయి ప్రజలు మోసపోతరు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు 100 రోజుల్లోనే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూస్తున్నరు. ఆరు చందమామలు, ఏడు సూర్యులు పెడతం అని మాట్లాడిన్రు. ఇవాళ నోటికి మొక్కాలే. 400 హామీలిచ్చిన్రు. ఇప్పుడు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతం అని ఓ మంత్రి అంటడు. బిడ్డా.. రైతుల చెప్పులు చానా బందోబస్తు(గ‌ట్టిగా) ఉంటయ్. ఆరు గ్యారంటీల గురించి అడితే.. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో ఏసుకుంటా.. పెండ మొకానికి రాసుకుంటా.. చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా అని మాట్లాడుతున్నడు. తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇది గౌరవమా? ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా?’’ అని కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు.

" నీకు ఏ పరిస్థితి దొరికిందో ముందుకు ఒక మార్గం వేసుకొని సక్రమంగా పని చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రజలు మీకు అధికారం ఇచ్చిన్రు.. మాకు అభ్యంతరం లేదు. మాకంత ఈర్ష కూడ లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చెయ్.. కావాలంటే మాకంటే మంచిగా పని చెయ్. మంచి పేరు తెచ్చుకో. మాతోని పోటీ పడేటట్లు చూసుకో. అంతేకానీ, చీరతము, పండబెట్టి తొక్కుతము.. రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతము లాంటి మాటలు వద్దు'' - అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేసీఆర్ హిత‌వు ప‌లికారు.

కేంద్రం ఏం చేసింది?

తెలంగాణలోని 33 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క నవోదయ విద్యా సంస్థ కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. దేశంలోని ఒక్కో జిల్లాకు ఒక నవోదయ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం అని కేసీఆర్ గుర్తు చేశారు. తమకు కూడా నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని వంద యాభై ఉత్తరాలు మోడీకి రాశానని.. అయినా ఒక్క నవోదయ కూడా కేంద్రం ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్ లో వేయొద్దని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.

బండి.. నీ బండి సాగ‌దు!

కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇక్కడ ఏం చేశారని కేసీఆర్‌ ప్రశ్నించారు. 5 రూపాయ‌ల ఎత్తు పని కూడా చేయలేదని విమర్శించారు. బీఆర్ ఎస్ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ ఎన్నో పనులు చేశారని తెలిపారు. బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు ఎంత తేడా ఉందో గమనించాలన్నారు. ఉద్యమ సమయంలో సన్నాసులు, దద్దమ్మలు లాంటి ఘాటు వ్యాఖ్యలు తాను కూడా మాట్లాడానని.. పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు తాను ఎప్పుడూ రేవంత్‌లాగా తప్పుడు మాటలు మాట్లాడలేదని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు.