Begin typing your search above and press return to search.

8 సార్లు కలిసొచ్చిన సెంటిమెంట్... కంటిన్యూ చేస్తున్న కేసీఆర్!

ఈ నేపథ్యంలోనే నామినేషన్‌ లు వేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తనకు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్ ను మరోసారి కంటిన్యూ చేస్తున్నారు కేసీఆర్!

By:  Tupaki Desk   |   3 Nov 2023 12:12 PM GMT
8 సార్లు కలిసొచ్చిన సెంటిమెంట్... కంటిన్యూ చేస్తున్న కేసీఆర్!
X

తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్‌ లు స్వీకరిస్తారు. ఇక ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్‌ లు వేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తనకు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్ ను మరోసారి కంటిన్యూ చేస్తున్నారు కేసీఆర్!

అవును... ఇప్పటికే పూజలు, దేవుడి దర్శనాలు, హోమాలు, యాగాలు ఈ విషయంలో కేసీఆర్ కి ఉన్న ఆసక్తి గురించి తెలిసిందే. ఇదే సమయంలో 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచి ఉన్న ఒక సెంటిమెంట్ ను ఆయన ఈదఫా కూడా కంటిన్యూ చేస్తున్నారు. నంగునూర్ మండలం కొనయిపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

1883లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ చేతిలో 887 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డిపై 16,156 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఆ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను కేసీఆర్... నంగునూర్ మండలం కొనయిపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల అనంతరం నామినేషన్ వేశారు. ఇదే సమయంలో... 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్స్) పార్టీని స్థాపించినప్పుడు కూడా ఈ ఆలయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.

ఇలా ప్రతి ముఖ్యమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టేముందు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం కేసీఆర్‌ కు ఆనవాయితీగా మారింది! ఈ క్రమంలో ఇప్పటికే ఫాం హౌస్‌ లో కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం శుక్రవారంతో పూర్తవుతుంది! అనంతరం శనివారం ఉదయం కోనాపూర్‌ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ స్థానాలకి నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

కాగా... 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీచేసిన మొదటిసారి గెలిచిన అనంతరం 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2004, 2006 (బైపోల్స్), 2008 (బైపోల్స్) కరీంనగర్ ఎంపీగా గెలిచారు. అనంతరం 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే.