Begin typing your search above and press return to search.

కేసీయార్ నోట ఎన్టీయార్ పేరు....టీడీపీ పుట్టుక గురించి కూడా...!

ఇందిరాగాంధీ హయాంలో పేదలు ఎక్కువై ఆకలితో అల్లాల్లాడుతూంటేనే ఎన్టీయార్ టీడీపీని స్థాపించారని, అధికారంలోకి వచ్చి వారి ఆకలి తీర్చారని ఫ్లాష్ బ్యాక్ ని కేసీయార్ గుర్తు చేశారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 12:24 PM GMT
కేసీయార్ నోట ఎన్టీయార్ పేరు....టీడీపీ పుట్టుక గురించి కూడా...!
X

బీయారెస్ అధినేత కె చంద్రశేఖరరావు మాటల మరాఠీగా పేరు గడించారు. ఎప్పటికి ఏది అవసరమో ఆయన దానికి అందిపుచ్చుకుని మాట్లే నేర్పులో సిద్ధ హస్తులు. అలాంటి కేసీయార్ నోట ఇపుడు హఠాత్తుగా ఎన్టీయార్ పేరు పలికింది. అది యాధృచ్చికం అయితే కాదు, ఎందుకంటే ఇప్పటికే బీయారెస్ మంత్రులు పలువురు ఎన్టీయార్ పేరుని ప్రస్తావిస్తూ తన ఎన్నికల సభలను రక్తి కట్టిస్తున్నారు.

కేసీయార్ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న తలసాని శ్రీనివాస్ అయితే తన గుండె పొరలలో ఎన్టీయార్ ఎపుడూ ఉంటారని చెప్పేసుకున్నారు. ఇక కేసీయార్ కూడాఎన్టీయార్ ప్రస్తావనను సందర్భోచితంగా తీసుకుని వచ్చారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులు తప్ప ఇంకేమీ లేవు అని కేసీయార్ కొట్టి పారేశారు.

ఇందిరాగాంధీ హయాంలో పేదలు ఎక్కువై ఆకలితో అల్లాల్లాడుతూంటేనే ఎన్టీయార్ టీడీపీని స్థాపించారని, అధికారంలోకి వచ్చి వారి ఆకలి తీర్చారని ఫ్లాష్ బ్యాక్ ని కేసీయార్ గుర్తు చేశారు. మరి అంత అద్భుతమైన పాలన ఇందిరమ్మ హయాంలో చేసి ఉంటే టీడీపీ ఎందుకు పుట్టింది అని ఆయన లాజిక్ తో కూడిన ప్రశ్నను కూడా సంధించారు.

ఎన్టీయార్ కిలో రెండు రూపాయల బియ్యం పధకాన్ని ప్రకటించి పేదలకు ఆకలి తీర్చినది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలన బహు చక్కగా ఉంటే ఎన్టీయార్ అసలు టీడీపీ ఎందుకు పెడతారు అంటూ టీడీపీ పుట్టుపూర్వోత్తరాలను కూడా బయటకు తీసి మరీ కాంగ్రెస్ కి గట్టిగా విమర్శించారు.

కాంగ్రెస్ తెలంగాణాను తీరని అన్యాయం చేసిందని, ఉన్న తెలంగాణాను బలవంతంగా ఆంధ్రాతో కలిపిందని మళ్ళీ ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ప్రత్యేక తెలంగాణా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి పోరాడి తెలంగాణాను ప్రజలు సాధించామని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హయాంలోనే కదా రైతుల గుండెలు పత్తికాయలు పగిలినట్లుగా పగిలిపోయాయని కేసీయార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలనగణా కోసం ఎంతో మంది ఉద్యమంలోకి వచ్చి బలిదానం చేశారని ఆయన గుర్తు చేశార్. తొలి దశ ఉద్యమంలో ఎంతో మంది మరణిస్తే మలిదశ ఉద్యమంలో కూడా చాలా మంది అసువులు బాశారని కేసీయార్ అన్నారు.

కేంద్రంలో రెండు సార్లు వరసగా అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ కి తెలంగాణా ఇవ్వాలని మనసు మాత్రం రాలేదని, ప్రకటన చేసి ఒకసారి వెనక్కి తగ్గారని కూడా కేసీయార్ ఫైర్ అయ్యారు. ఆఖరుకు సకల జనుల సమ్మెను చేయడం ద్వారానే తెలంగాణాను తెచ్చుకోగలిగామని ఆయన పేర్కొన్నారు.

మొత్తానికి ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనకు ఎంటీయార్ ను టీడీపీ ని ముందు పెట్టి మరీ కేసీయార్ గట్టిగానే జవాబు ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ ని విమర్శిస్తూ ఎన్టీయార్ ని పొగడడంలోనే కేసీయార్ రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు.

టీడీపీ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయడం లేదు. ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్ ని అంటున్నా బాహాటంగా అయితే ఏమీ ప్రకటన లేదు. దాంతో బీయారెస్ కూడా ఎన్టీయార్ ని చంద్రబాబుని పొగుడుతోంది. కేసీయార్ అయితే ఎన్టీయార్ ప్రస్థావనను తీసుకుని రావడం వెనక చాలా వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఇందిరమ్మ రాజ్యానికి ఎన్టీయార్ రాజ్యంతో చెక్ పెట్టేసారు అని అంటున్నారు.