బీఆర్ఎస్ వద్ద పదునైన నినాదం ఏదీ లేదా ?
ఇక వాడి వేడి అన్న మాటలకు పర్యాయపదం కేసీఆర్ స్పీచ్ గా చెప్పుకోవాలి. అలాంటి కేసీఆర్ చాలా కాలానికి ఇచ్చిన స్పీచ్ మీద భిన్నమైన స్పందన కనిపిస్తోంది.
By: Tupaki Desk | 28 April 2025 10:30 PMబీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఅర్ అంటేనే మాటల మాంత్రికుడు. ఆయన మైక్ అందుకోవాలే కానీ వినేవారిలో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది. ఒక్కసారిగా అంతా భావోద్వేగానికి లోను అవుతారు. కేసీఆర్ ప్రసంగంలో వేసే చెణుకులు ఉర్రూతలూగిస్తాయి. ఆయన సెటైర్లతో పంచులతో సమ్మోహనం చేస్తారు.
ఇక వాడి వేడి అన్న మాటలకు పర్యాయపదం కేసీఆర్ స్పీచ్ గా చెప్పుకోవాలి. అలాంటి కేసీఆర్ చాలా కాలానికి ఇచ్చిన స్పీచ్ మీద భిన్నమైన స్పందన కనిపిస్తోంది. పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భగా కేసీఅర్ సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. అయితే ఇది గతంలో మాదిరిగా అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు.
ఆనాటి మ్యాజిక్ ని ఆయన రిపీట్ చేయలేకపోయారు అని అంటున్నారు. ఎంతసేపూ ఆత్మ స్తుతి పరనిందగా ఆయన స్పీచ్ సాగింది అని చెప్పుకుంటున్నారు. మా ఏలుబడిలో అంతా స్వర్ణయుగం అని చెబుతూ స్వర్గాన్ని ఇలకు దించామని ఘనంగా చాటుకున్నారు. అదే సమయంలో పదహారు నెలల రేవంత్ రెడ్డి పాలనలో ఏమీ జరగలేదు అన్నట్లుగా విమర్శించారు.
అయితే అంత బాగా పాలించిన బీఆర్ఎస్ ని జనాలు ఎందుకు ఓడించారు అన్నది నిశితమైన ఆత్మ విమర్శ చేసుకుని ఇచ్చిన స్పీచ్ గా లేదని అంటున్నారు. మా హయాంలో కొన్ని తప్పులు జరిగాయి అని చెప్పి ఉంటే ఆయన రెండు సార్లు సీఎం గా చేసిన అనుభవంతో ఇచ్చిన స్పీచ్ గా కనిపించేది.
కానీ ఆయన తమను జనాలు ఎన్నుకోవడంలో పొరపాటు చేశారని కాంగ్రెస్ మభ్యపెట్టి ఇచ్చే హామీలకు ఆకర్షితులు అయ్యారని విశ్లేషిస్తూ ఇచ్చిన స్పీచ్ గా ఉంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ వద్ద పదునైన నినాదం ఏదీ లేదా అన్న ప్రశ్నలు కూడా ఈ ప్రసంగం తర్వాత వస్తున్నాయి.
తెలంగాణా ఉద్యమం అని కేసీఆర్ పదే పదే చెబుతూ ఆ క్రెడిట్ ని క్లెయిం చేసుకునేందుకు మరో మారు ప్రయత్నం చేస్తున్నారు అని అనుకోవాలి. నిజానికి తెలంగాణా ఉద్యమ ఫలితాలను రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ద్వారా బీఆర్ఎస్ అనుభవించింది.
అయినా సరే మళ్ళీ అదే సెంటిమెంట్ ని రాజేయాలని చూస్తోంది అన్నది కేసీఆర్ ప్రసంగం మొత్తం చూస్తే అర్ధం అవుతోంది. ఇక మరో విషయం ఏమిటి అంటే కాంగ్రెస్ ని విలన్ గా జనం ముందు చూపించడం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏణ్ణర్ధం కూడా కాకుండానే ఈ ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పడం తొందరపాటు అవుతుంది అని అంటున్నారు.
అది బీఆర్ ఎస్ అధికార కాంక్షను తెలియచేసేలా ఉంది తప్ప ప్రభుత్వం మీద ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా విమర్శలు చేసే విధంగా లేదని అంటున్నారు. ఇలా తమను పొగుడుకుంటూ కాంగ్రెస్ ని తెగనాడుతూ సాగిన కేసీఆర్ ప్రసంగం రొటీన్ గానే ఉందని అంటున్నారు.
మరో వైపు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇంతకంటే అస్త్రాలు బీఆర్ ఎస్ దగ్గర లేవా లేక కాంగ్రెస్ ఈ ఏణ్ణర్థం పాలన విషయంలో చెప్పేందుకు ఇంతకంటే తప్పులు ఏవీ కనబడలేదా అన్నది కూడా చర్చగా ఉంది. ఆ విధంగా చేయగలిగారు అంటే కనుక అది కాంగ్రెస్ క్రెడిట్ గానే చూడాలి.
ఇక రాసుకోండి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెబుతున్న మాటలు క్యాడర్ లో ఉత్సాహానికే తప్ప మరో దానికి కావని అర్ధం అవుతోంది. ఈ రోజున ఎక్కడా ఎన్నికలు లేవు. కనీసం స్థానిక ఎన్నికలు జరిగి అందులో బీఆర్ఎస్ తన సత్తా చాటి ఉంటే కనుక అపుడు జనాలలో మార్పు వచ్చింది కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పినా నమ్మబుల్ గా ఉంటుందని అంటున్నారు.
ఈ మధ్యన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ప్రసంగంలో పస లేదని మాత్రం చర్చ సాగుతోంది. దీని మీద కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ స్పీచ్ అంతా అయోయమంగా ఉందని కామెంట్స్ చేశారు. మరి జనాలకు కూడా ఇలాగే అనిపిస్తోందా ఒకవేళ అదే నిజమైతే మాత్రం బీఆర్ఎస్ చక్కదిద్దుకోవాల్సినవి చాలానే ఉన్నాయని అంటున్నారు