Begin typing your search above and press return to search.

ఇంతకీ కేసీఆర్‌ కు కొత్త మిత్రులు ఎవరు?

తాము ఎన్డీఏతో లేము, ఇండియా (ప్రతిపక్షాల ఫ్రంట్‌) కూటమితోనూ లేవ ని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తాము తమ మిత్రులతో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

By:  Tupaki Desk   |   2 Aug 2023 3:30 PM GMT
ఇంతకీ కేసీఆర్‌ కు కొత్త మిత్రులు ఎవరు?
X

టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చి దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా చలామణి అయిపోవాల ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద కలలే కన్నారు. పంజాబ్, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ ఇలా ఒకటేమిటి.. ప్రాంతీయ పార్టీలు అధికారం లో ఉన్న చోట, బలంగా ఉన్న చోటల్లా పర్యటించి వచ్చారు.

బీజేపీకి, కాంగ్రెస్‌ కు సమాన దూరం పాటిస్తున్నామంటూ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ పెద్ద హడావుడే చేశారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో కనీసం 150కి పైగా స్థానాల్లో పోటీ చేయాల ని మొదట్లో పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. తీరా ఎక్కడి గొంగళి అక్కడే వేసినట్టు అంతా గప్‌ చుప్‌ సాంబార్‌ బుడ్డిలా అయిపోయింది. కేసీఆర్‌ కు జాతీయ స్థాయి నాయకుడంత సీన్‌ లేదని భావించిన ఆయా పార్టీల అధినేతలు లైట్‌ తీసుకున్నారు. చివర కు దేశం లో రెండు పెద్ద పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ ఇటీవల తమ మిత్రపక్షాలతో నిర్వహించిన సమావేశాల కు కేసీఆర్‌ కు అసలు ఆహ్వానమే దక్కలేదు.

అయితే మహారాష్ట్ర మీద మాత్రం కేసీఆర్‌ కు పెద్ద ఆశలే ఉన్నట్టు ఉన్నాయి. ఏ మాత్రం ఖాళీ దొరికినా కేసీఆర్‌ మహారాష్ట్రలో వాలిపోతున్నారు. మందీ మార్బలంతో, భారీ వాహన శ్రేణితో ఆ రాష్ట్రంలో హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల సభలు కూడా నిర్వహించారు. అయితే ఇప్పటివరకు కింద స్థాయి చోటా మోటా నేతలే తప్ప పెద్దగా పేరున్న నేతలెవరూ కేసీఆర్‌ పార్టీలో చేరలేదు

ప్రస్తుతం తెలంగాణ ను వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కేసీఆర్‌ మాత్రం మరోసారి మహారాష్ట్రలో వాలిపోయారు

తాము ఎన్డీఏతో లేము, ఇండియా (ప్రతిపక్షాల ఫ్రంట్‌) కూటమితోనూ లేవ ని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తాము తమ మిత్రులతో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. దేశం లో బీఆర్‌ఎస్‌ తో కలిపి కేవలం 11 పార్టీలే ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేకుండా విడిగా ఉన్నాయి. వీటిలో ప్రధాన పార్టీలు.. వైసీపీ, టీడీపీ, బిజూ జనతాదళ్, బీఆర్‌ఎస్, జనతాదళ్‌ సెక్యులర్‌ మాత్రమే. మిగతావన్నీ చిన్న పార్టీలు. ఈ పార్టీలేవీ కేసీఆర్‌ కు మిత్రులుగా లేవు. మరి కేసీఆర్‌ అంటున్న మిత్రులెవరని ప్రస్తుతం చర్చ జరుగుతోంది

మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని నాశనం చేశాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అయితే తాము తమ మిత్రుల తో కలిసి ఉన్నామని అన్నారు. కానీ కేసీఆర్‌ వెంట ఒక్కరంటే ఒక్క మిత్రుడూ (పార్టీ) కనిపించడం లేదు. కర్ణాటక లో కుమారస్వామి, తమిళనాడు లో వీసీకే పార్టీ కూడా కేసీఆర్‌ కు దూరమయ్యాయి. కుమారస్వామి బీజేపీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు.

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ తో ముందుకు వెళ్లడంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఆయన ను నమ్మడం మానేశాయని టాక్‌. బీజేపీకి లాభం చేకూర్చడానికే కాంగ్రెస్‌ లేకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ ను కేసీఆర్‌ ముందుకు తెచ్చారని కాంగ్రెస్‌ పార్టీ భావించిందని అంటున్నారు. అలాగే తమ ఓటు బ్యాంకు ను దెబ్బతీయడానికే కేసీఆర్‌ కాంగ్రెస్‌ కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ భావించిందని అంటున్నారు.

దీంతో రెంటికి చెడ్డ రేవడిలా కేసీఆర్‌ పరిస్థితి తయారైందని చెబుతున్నారు. అందుకే దేశం లో 11 పార్టీలు మినహాయించి ఉన్న పార్టీలన్నీ కాంగ్రెస్‌ నేతృత్వం లోని ఇండియా కూటమి లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లో చేరిపోయాయని పేర్కొంటున్నారు. మరి కేసీఆర్‌ చెబుతున్న కొత్త మిత్రులెవరో ఆయనే చెప్పాల్సి ఉంటుంది.