Begin typing your search above and press return to search.

తన టికెట్ తానే అనౌన్స్ చేసుకున్న కవిత

నాది నిజామాబాద్.. నా సొంతూరు. నా అత్త‌గారి ఊరు" అని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   11 Aug 2023 5:27 AM GMT
తన టికెట్ తానే అనౌన్స్ చేసుకున్న కవిత
X

తన టికెట్ ను తానే ప్రకటించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ లో మిగిలిన వారితో పోలిస్తే తాను భిన్నమన్న విషయాన్ని తాజా ప్రకటనతో ఆమె చెప్పేసుకున్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై అధినేత ప్రకటించటం మామూలే. అందుకు భిన్నంగా తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని ఆమె స్పష్టం చేయటం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆమె పదవీ కాలం నవంబరు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి నాటి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఎమ్మెల్యేల కోటాలో తొలిసారి.. రెండోసారి స్థానిక సంస్థల కోటా నుంచి ఆమె ఎంపికయ్యారు. తాను చేపట్టిన ఎమ్మెల్సీ పదవి మీద కవిత ఏ మాత్రం ఇంట్రస్ట్ లేదన్న విషయం తెలిసిందే.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. "నేను ఇది వ‌ర‌కే చెప్పాను.. మీ అంద‌రి సాక్షిగానే చెప్పాను.. అర‌వింద్ నీవు ఎక్క‌డ నిల‌బ‌డ్డా.. వ‌చ్చి నీ వెంట‌బ‌డి ఓడిస్తా. ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ఆయ‌న చెబుతున్నాడ‌ట‌. ఎంపీకి పోను.. ఎమ్మెల్యేగానే కోరుట్ల‌లో పోటీ చేస్తాన‌ని అర‌వింద్ అంటుండ‌ట‌.. నేను ఎక్క‌డ పోను బిడ్డా.. నిజామాబాద్ పార్ల‌మెంట్‌కు వ‌స్తా.. క‌చ్చితంగా గెలుస్తా. నాది నిజామాబాద్.. నా సొంతూరు. నా అత్త‌గారి ఊరు" అని పేర్కొన్నారు.

తాను బతికినా.. చనిపోయినా తాను నిజామాబాద్ ను వదిలేది లేదన్న కవిత.. "నేను ఇంత‌కుముందే చెప్పిన.. బ‌తికున్నా.. చ‌నిపోయినా.. రేపు నా క‌ట్టే కాలేది కూడా నిజామాబాద్‌లోనే. క‌చ్చితంగా నిజామాబాద్ నుంచే పార్ల‌మెంట్‌కు పోటీ చేస్తా. నేను పారిపోయేది లేదు. నువ్వే కోరుట్ల పోతా.. అక్క‌డ పోతా.. ఇక్క‌డ పోతా అని అంటున్న‌వ‌ట‌. కోరుట్ల‌కు పో.. అక్క‌డ‌కు కూడా వ‌చ్చి నిన్ను ఓడిస్తా. నువ్వు ఎక్క‌డ‌న్న పో.. స‌ర్పంచ్‌గా, ఎంపీటీసీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్త‌వ‌.. నిన్ను వ‌దిలిపెట్ట‌.. ఫ‌స్ట్ వాగ‌డం త‌గ్గించుకో" అంటూ ఫైర్ అయ్యారు.

ఇన్ని మాటలు చెప్పిన కవిత.. తాను నిజామాబాద్ నుంచి అధినేత ఆశీస్సులతో పోటీ చేస్తానన్న ఒక్క మాట చెప్పి ఉంటే.. ఈ తలనొప్పులు ఉండేవి కాదు కదా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. నిజమే కదా. శకునం చెప్పే బల్లి సామెత మాదిరి.. తన ప్రత్యర్థి ఎలా మాట్లాడాలో చెప్పే కవిత.. తాను మాట్లాడే సమయంలో మాత్రం దొరికిపోవటం గమనార్హం.