Begin typing your search above and press return to search.

"రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం"

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. "రేవంత్ రేసుగుర్రం కాదు.. గుడ్డి గుర్రం" అని వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   8 March 2024 4:54 PM GMT
రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం
X

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. "రేవంత్ రేసుగుర్రం కాదు.. గుడ్డి గుర్రం" అని వ్యాఖ్యానించారు. మూడు నెలల ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో 3ని రద్దు చేయడం వంటి డిమాండ్లతో ఇందిరా పార్క్ వద్ద 'భారత్ జాగృతి' ఆధ్వర్యంలో కవిత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని.. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని కవిత విమర్శించారు. కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని అన్నారు. జీవో 3 నిజమైతే 30 వేల ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగులు కన్ఫ్యూజ్‌లో ఉన్నారని అన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడబోరని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. ఆడ‌బిడ్డ‌ల రిజ‌ర్వేష‌న్ల కోసం హైకోర్టులో ఏడాది నుండి కేసీఆర్ కొట్లాడుతుంటే... రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఎందుకు వెన‌క్కి తీసుకుందని ప్ర‌శ్నించారు.

"కొట్లాడాల్సింది పోయి గ‌తంలో ఇచ్చిన నోటిఫికేష‌న్ల‌లోనూ జీవో3 అమ‌లు చేస్త‌వా...? ఇదేక్క‌డి అన్యాయం. మ‌హిళ‌ల‌పై మీకున్న చిత్త‌శుద్ధి ఇదేనా? ఆడ‌బిడ్డ‌ను క‌డుపుల‌నే సంపుత‌రు. పుట్టినా స‌దువుకోనియ్య‌రు. స‌దువుకోనిచ్చినా ఉద్యోగాలొచ్చుడు క‌ష్టం. కానీ అంబేద్క‌ర్ గారి స్ఫూర్తితో మ‌న బిడ్డ పీవీ ప్ర‌ధానిగా ఉండి ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు 33శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చారు. ఆనాటి నుండి ఉన్న రిజ‌ర్వేష‌న్ల‌కు ఇప్పుడు కాంగ్రెస్ స‌ర్కార్ తూట్లు పొడిచింది. దీనిపై తిర‌గ‌బ‌డ‌తాం... పోరాడి ఆడబిడ్డ‌ల హ‌క్కుల‌ను సాధించుకుంటాం" అని క‌విత వ్యాఖ్యానించారు.

"ఆడ‌బిడ్డ‌లు క‌న్నీరు పెట్ట‌డం మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు... కేసీఆర్ గారు ప‌రీక్ష పెట్టి, ఫ‌లితాలిస్తే మీరు నియామ‌క ప‌త్రాలిస్తున్న 30 వేల ఉద్యోగాల్లో ఆడ‌బిడ్డ‌ల‌కు ఎన్ని ఉద్యోగాలు ద‌క్కాయి? శ్వేతప‌త్రం ఇస్త‌రా..? సుప్రీం తీర్పును కాద‌ని క‌ర్నాట‌క‌, బీహార్ ప్ర‌భుత్వాలు 33శాతం ఇస్తుంటే మీరెందుకు ఇవ్వ‌రు?" అని కవిత ప్రశ్నించారు.