Begin typing your search above and press return to search.

ఉగ్రదాడిలో తెలుగువారు... వెంటాడి మరీ హతమార్చబడ్డారు!

అవును... తాజాగా జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో తెలుగువారు మృతిచెందారు. ఇందులో భాగంగా... నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు.

By:  Tupaki Desk   |   23 April 2025 7:12 AM
Terror Strikes in Kashmir Telugu Tourists
X

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయిన సంగతి తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులను ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్పటివరకూ సందర్శకుల కేరింతలతో సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది.


ఆహ్లాదకరమైన వాతావారణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరిచి ఉన్న వేళ.. ఉగ్రమూకల తూటా గాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరుగా నేలకొరిగారు. ఫలితంగా పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ఈ అమానవీయ చర్యకు ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఈ ఘటనలో తెలుగువారు బలైపోయారు!


నేలకొరిగిన నెల్లూరు వాసి!:

అవును... తాజాగా జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో తెలుగువారు మృతిచెందారు. ఇందులో భాగంగా... నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆయన.. పహల్గాంలో విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలో ఉగ్రదాడిలో మృతి చెందారు.


విశాఖకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి!:

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందారు. చంపొద్దని వేడుకుంటూ పరిపోతున్న ఆయనను వెంటాడి మరీ చంపినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఆయన మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించి.. విశాఖలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

హైదరాబాద్ లోని ఐబీ ఆఫీసర్ మృతి!:

కశ్మీర్ లోని ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు. కోఠీలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్.ఐ.బీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు, భార్య ముందే ఆయనను ఉగ్రవాదులు కాల్చిచంపారు. బీహార్ కు చెందిన మనీశ్.. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు.