Begin typing your search above and press return to search.

జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి!

వివరాల్లోకి వెళితే, కుప్వారా జిల్లాలో 45 ఏళ్ల సామాజిక కార్యకర్త రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

By:  Tupaki Desk   |   27 April 2025 4:22 AM
జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి!
X

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తమ పంజా విసిరారు. ఇటీవల పహల్గామ్లో జరిగిన దాడి మరువకముందే, కుప్వారా జిల్లాలో ఒక సామాజిక కార్యకర్తపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, కుప్వారా జిల్లాలో 45 ఏళ్ల సామాజిక కార్యకర్త రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రసూల్ మాగ్రేను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. రసూల్ మాగ్రేపై దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుండి అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం బండిపోరాలో నిర్వహించిన తనిఖీల్లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా తో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాద సహచరులను అరెస్టు చేశారు. వీరి నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం పహల్గామ్లో జరిగిన ఘోరమైన దాడిలో 26 మంది మరణించారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించిన పుల్వామా బాంబు దాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అత్యంత తీవ్రమైన ఉగ్రదాడులలో పహల్గామ్ దాడి ఒకటిగా పరిగణించబడుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న పెద్ద దాడులలో ఇది ఒకటి.

తాజాగా కుప్వారాలో సామాజిక కార్యకర్తపై జరిగిన దాడి, బండిపోరాలో ఉగ్రవాద సహచరుల అరెస్టులు జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై ఆందోళనలను పెంచుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు భద్రతా దళాలు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నాయి.