Begin typing your search above and press return to search.

అయోధ్య బాలరాముడి రాయి వెనుక కన్నీటి గాథ

అయోధ్యలో కొలువైన బాలరాముడి ముగ్ద మనోహర రూపాన్ని చూసి ఆనందంతో పరవశించిపోయే వారు కోట్లాది మంది

By:  Tupaki Desk   |   28 Jan 2024 1:30 PM GMT
అయోధ్య బాలరాముడి రాయి వెనుక కన్నీటి గాథ
X

అయోధ్యలో కొలువైన బాలరాముడి ముగ్ద మనోహర రూపాన్ని చూసి ఆనందంతో పరవశించిపోయే వారు కోట్లాది మంది. ఆ రూపాన్ని దర్శించుకోవటం కోసం భారీగా ఖర్చు చేసి.. అయోధ్యకు తరలి వెళ్లేందుకు కోట్లాది మంది సిద్ధమవుతున్నారు. ఇలాంటి వేళ.. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు ఉపయోగించిన శిల వెనుక ఒక కన్నీటి గాథ ఉంది. అనూహ్యంగా బయటకు వచ్చిన ఈ రియల్ స్టోరీ గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

కర్ణాటకలోని ఒక రైతు పొలం నుంచి తీసిన రాయితో ఈ విగ్రహాన్ని మలచటం తెలిసిందే. అయితే.. పొలంలో రాయిని బయటకు తీసే క్రమంలో.. ఆ పనిని ఒప్పుకున్న ఒక కాంట్రాక్టర్ అప్పులు పాలైన చేదు నిజం తెలిస్తే అయ్యో అనిపించకమానదు. బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ.. ఆయన ఉపయోగించిన శిల ఎక్కడిది? దానిని బయటకు తీసిన వ్యక్తి పరిస్థితేంటి? అన్న ప్రశ్నకు సమాధానం దొరికితే షాకింగ్ నిజం బయటకు వస్తుంది.

కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లా హెచ్ డీ కోట తాలూకా బుజ్జేగౌడనపురలోని ఒక పొలంలో బయటపడిన ఈ రాయి ఈ రోజు కోట్లాది మందికి కన్నుల పండుగా మారింది. తన పొలంలోని రాయిని గుర్తించిన రైతు.. దాన్ని బయటకు తీసే కాంట్రాక్టును శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆ రాయిని బయటకు తీశారు. రాయిని బయటకు తీసిన కార్మికులకు ఇవ్వాల్సింది ఇచ్చేసిన తర్వాత సదరు కాంట్రాక్టరుకు రూ.25 వేలు మిగిలింది.

ఇక్కడే అనుకోని ట్విస్టు తెర మీదకు వచ్చింది. తమ అనుమతి లేకుండా పొలాన్ని తవ్వి.. రాతిని బయటకు తీశారంటూ కర్ణాటక రాష్ట్ర గనులు.. భూగర్భ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. తక్షణం రూ.80వేలు కట్టాలని లేకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడిన శ్రీనివాస్ చేతిలో ఉన్న రూ.25వేలకు అదనంగా రూ.55 వేలు అవసరమయ్యాయి. అతని చేతిలో డబ్బులు లేకపోవటంతో.. భార్య తాళిని తాకట్టు పెట్టి.. జరిమానా కట్టేశారు.

కాంట్రాక్టర్ శ్రీనివాస్ కు ఎనిమిది నెలల క్రితమే పెళ్లైంది. అయితే.. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఏం చేయాలో తోచక భార్య తాళిని తాకట్టు పెట్టి.. జరిమానాను కట్టేశారు. ఈ రాయిని అయోధ్యలో బాలరాముడి విగ్రహం కోసం ఎంపిక చేసుకుంటారని ఆయనకు తెలియదు. అయితే.. అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి అవసరమైన అరుదైన రాతి కోసం అన్వేషిస్తున్న వారికి.. శ్రీనివాస్ బయటకు తీసినరాయి మేలురకమన్న విషయాన్ని గుర్తించి.. దాన్ని అయోధ్యకు తరలించారు. ఇది.. అయోధ్య బాలరాముడి విగ్రహానికి సంబంధించిన శిల స్టోరీ.