Begin typing your search above and press return to search.

ఎలక్షన్స్‌ ఎక్కడ ఉంటే అక్కడ కేఏ పాల్‌ ఉండాల్సిందే!

ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకటించడంతో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేస్తానని తాజాగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 5:18 AM GMT
ఎలక్షన్స్‌ ఎక్కడ ఉంటే అక్కడ కేఏ పాల్‌ ఉండాల్సిందే!
X

సీరియస్‌ పాలిటిక్స్‌ లో ఆటలో అరటి పండు, కమెడియన్‌ గా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ను అందరూ భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన చేసే వ్యాఖ్యలు, ఇచ్చే హామీలు నమ్మశక్యం కాదు కాబట్టి ఆయన మాటలను అంతా లైట్‌ తీసుకుంటూ ఉంటారు. కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రిని తానేనని, జగన్‌ తన పార్టీలో చేరితే ప్రధానిని చేస్తానని, పవన్‌ కల్యాణ్‌ తన పార్టీలో చేరితే ఏపీ ముఖ్యమంత్రిని చేస్తానని కేఏ పాల్‌ తరచూ చెబుతూ ఉంటారనే విషయం తెలిసిందే.

అయినా కేఏ పాల్‌ తనపై వచ్చే మీమ్స్, సెటైర్లను పెద్దగా పట్టించుకోరు. యథాలాపంగా తాను చెప్పాలనుకున్నది చెప్పే తీరతారు. దేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.. కేఏ పాల్‌.

కాగా కేఏ పాల్‌ 2019లో నర్సాపురం లోక్‌ సభా స్థానం నుంచి బరిలోకి దిగి కేవలం 3 వేల ఓట్లు తెచ్చుకున్నారు. తెలంగాణలోని మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక బరిలోనూ దిగి ఓటమి పాలయ్యారు. ఈసారి విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ఇటీవలే తెలిపారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకటించడంతో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేస్తానని తాజాగా ప్రకటించారు. సికింద్రాబాద్‌ ను స్వర్గం చేస్తానని హామీ ఇచ్చారు.

ఎక్కడ ఏ ఎన్నికలో పోటీ చేసినా ఆ నియోజకవర్గానికి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ.. ఇలా ఎన్నో తీసుకొస్తానని కేఏ పాల్‌ చెబుతుంటారు. నమ్మశక్యం కాని హామీలను ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సికింద్రాబాద్‌ నియోజకవర్గాన్ని స్వర్గం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ మేరకు కేఏ పాల్‌ తాజాగా తుకారం గేట్‌ లోని మాంగర్‌ బస్తీలో పాల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని విన్నవించారు. ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలో ఉండాలని కోరుకుంటున్న వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

ప్రజాశాంతి పార్టీ తరఫున ఎన్నికల్లో టికెట్లు కావాలనుకునేవారు గూగుల్‌ పే లేదా ఫోన్‌ పే ద్వారా రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పాల్‌ కోరారు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఇటీవల కేఏ పాల్‌ కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రియాశీలకంగా లేని 537 పార్టీలను ఎన్నికల సంఘం నుంచి జాబితా నుంచి తొలగించింది.

ఆ పార్టీల గుర్తింపును, ఎన్నికల గుర్తులను సైతం రద్దు చేసింది. ఎన్నికల సంఘం తమ జాబితా నుంచి తొలగించిన రాజకీయ పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీ కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మరి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో, లేక తన పార్టీనే పునరుద్ధరించుకుంటారో వేచిచూడాల్సిందే.