Begin typing your search above and press return to search.

పోలీసులను పరిగెత్తించిన ఇన్ స్టా పోస్ట్.. తెల్లారే సరికి చూస్తే

గురువారం రాత్రి 11:45 గంటలకు వరుసగా అనేక పోస్ట్‌లు రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

By:  Tupaki Desk   |   10 May 2025 8:30 AM
పోలీసులను పరిగెత్తించిన ఇన్ స్టా పోస్ట్.. తెల్లారే సరికి చూస్తే
X

కాన్పూర్‌లో అర్ధరాత్రి ఒక విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. భయాందోళన చెందిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా విద్యార్థిని క్షేమంగానే కనిపించింది. అయితే ఆమె చెప్పిన అసలు విషయం మాత్రం చాలా ఆందోళన కలిగించేలా ఉంది. ఇంతకీ ఆ విద్యార్థిని ఏం చెప్పింది? అసలు అర్ధరాత్రి సూసైడ్ నోట్ ఎలా వైరల్ అయింది? వివరంగా తెలుసుకుందాం.

"నేను మేఘనను! నా జీవితం, కుటుంబం, ప్రేమతో విసిగిపోయాను. ఇక నేను ఉరి వేసుకోబోతున్నాను." 11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన సూసైడ్ నోట్‌లోని ఈ లైన్‌లు చూసి యూజర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అర్ధరాత్రి మరణానికి సంబంధించిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించడంతో సోషల్ మీడియా యూజర్లు వెంటనే స్పందించి ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు.

గురువారం రాత్రి 11:45 గంటలకు వరుసగా అనేక పోస్ట్‌లు రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. విద్యార్థినిని కాపాడటానికి మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చివరికి శుక్రవారం ఉదయం విద్యార్థిని క్షేమంగా కనిపించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు విద్యార్థిని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ పోస్ట్‌ల వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో విద్యార్థిని చెప్పింది. సమాచారం ప్రకారం.. పాత సిసామౌ పిరోడ్‌కు చెందిన అనురాగ్ జైస్వాల్‌కు గ్రీన్ పార్క్ చౌరస్తా దగ్గర పాన్ మసాలా దుకాణం ఉంది. అతని 16 ఏళ్ల కుమార్తె 11వ తరగతి చదువుతోంది. అనురాగ్ తెలిపిన ప్రకారం.. అతని కుమార్తె మేఘన పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఉంది. గురువారం అర్థరాత్రి సైబర్ నేరగాళ్లు అతని కుతురు ఐడిని హ్యాక్ చేశారు.

హ్యాక్ చేసిన తర్వాత విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్ ఐడి నుంచి ఆమె ఖాతాలో ఒక పేజీ సూసైడ్ నోట్‌ను పోస్ట్ చేశారు. దాని చివరలో "గుడ్ బై ఆల్ ఆఫ్ యూ" అని రాసి స్టోరీని పోస్ట్ చేశారు. బజారియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అరవింద్ కుమార్ శర్మ తెలిపిన ప్రకారం.. విచారణలో విద్యార్థిని తాను అలాంటి సూసైడ్ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయలేదని చెప్పింది. ప్రాథమిక విచారణలో ఏ ఐడి నుంచి నకిలీ సూసైడ్ నోట్ పోస్ట్ చేశారో ఆ ఐడి హ్యాక్ అయి ఉండవచ్చు లేదా అది నకిలీ ఐడి అయి ఉండవచ్చు. ఈ విషయంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.