Begin typing your search above and press return to search.

కావ్య లేఖ కొత్త పరేషాన్ తీసుకొచ్చిందా?

వరంగల్ లో కడియం కావ్య చేసిన నిర్వాకంతో పార్టీలో కలకలం రేగుతోంది. ఇప్పుడు అదే దారిలో కొందరు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   30 March 2024 6:44 AM GMT
కావ్య లేఖ కొత్త పరేషాన్ తీసుకొచ్చిందా?
X

వరంగల్ లో కడియం కావ్య చేసిన నిర్వాకంతో పార్టీలో కలకలం రేగుతోంది. ఇప్పుడు అదే దారిలో కొందరు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు నేతలు చూస్తున్నారు. బీఆర్ఎస్ తో భవిష్యత్ లేదని భావిస్తూ పార్టీ మారేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల తరువాత ఇంకా వలసలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

కడియం కావ్య రాసిన లేఖ అందరికి కొత్త దారి చూపిస్తోంది. అదే బాటలో ఇంకా కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కూడా కాంగ్రెస్ లోకి మారిపోవాలని చూస్తోందని సమాచారం. దీంతో బీఆర్ఎస్ నేతల్లో భయం కలుగుతోంది. బీఆర్ఎస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా నేతల వలసలకు ఆజ్యం పోస్తుందని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కూడా ఆందోళన నెలకొంటోంది. పార్టీ గెలవడం మాట అటుంచితే బోలెడు డబ్బు ఖర్చు చేసి ఓటమి పాలయితే కొత్త కష్టాలు వచ్చే అవకాశాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ లో ఉండాలా? బయటకు పోయి విజయం సాధించాలా? అనే ఆలోచనలో పడిపోతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.

కావ్య చూపిన మార్గంలోనే నడవాలని కొంతమంది చూస్తున్నారని టాక్. పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఎవరి మనసు ఎలా మారుతుందో తెలియడం లేదు. మన వారు అనుకున్న వారు కూడా పార్టీ మారి అధినేతకు కష్టాలు తెస్తున్నారు. కడియం కావ్య పార్టీని వీడటంతో చాలా మందిలో భయం పట్టుకుంది. కేసీఆర్ నమ్మిన బంటుగా ఉన్న కడియం శ్రీహరి పార్టీ మారడంపై జీర్ణించుకోలేకపోతున్నారు.

పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారిలో కూడా ఇంకా కొందరు పార్టీని వీడతారనే చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా కేసీఆర్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీని వీడితే తరువాత ఎవరనే దానిపై కూడా ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. నేతల్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు వారిలో ఆత్మస్థైర్యం నింపే పనిలో పడినట్లు తెలుస్తోంది.