భారత్ - పాక్ కాల్పుల విరమణ... కేఏ పాల్ ఫ్యాన్స్ ఫైర్!
గత మూడు రోజులుగా తీవ్రంగా వేడెక్కిపోయి ఉన్న భారత్ - పాక్ సరిహద్దులు శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అమెరికా నుంచి వీచిన ట్రంప్ రుతుపవనాలతో చల్లబడ్డాయి!
By: Tupaki Desk | 10 May 2025 9:21 PM ISTగత మూడు రోజులుగా తీవ్రంగా వేడెక్కిపోయి ఉన్న భారత్ - పాక్ సరిహద్దులు శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అమెరికా నుంచి వీచిన ట్రంప్ రుతుపవనాలతో చల్లబడ్డాయి! ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్.. ఇదంతా అమెరికా మధ్యవర్తిత్వంతోనే సాధ్యమైందని తెలిపారు. కానీ.. వాస్తవానికి దీని వెనుక కేఏ పాల్ ఉన్నట్లు తెలుస్తోంది!
అవును... భారతదేశంలోని సుమారు 140 కోట్ల మంది ప్రజానికంలో గరిష్టంగా ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా.. భారత్ - పాక్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపేశారు! దీనికోసం రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని అన్నారు.. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయని చెప్పి అందుకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు... గడిచిన 48 గంటల్లో.. ప్రధాన మంత్రులు మోడీ, షెహబాజ్ షరీఫ్.. విదేశాంగ మంత్రి జైశంకర్.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, ఆసిం మాలిక్ వంటి సీనియర్ భద్రత, పాకిస్థాన్ అధికారులతో తాను, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చర్చలు జరిపినట్లు మార్కో రూబియో తెలిపారు.
అయితే.. వాస్తవానికి భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం చల్లబడటానికి.. కేఏ పాల్ అనే అకాల వర్షమే కారణం అని అంటున్నారు ఆయన అభిమానులు! రెండు రోజుల క్రితం అనంతపురం ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన పాల్... తాను ఇప్పటికే మోడీ, పాక్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు. యుద్ధం వల్ల ఒరిగేదేమీ లేదని వారిరువురికీ చెప్పారు!
ఫోన్ లో పనికాకపోతే తాను ఆదివారం పాకిస్థాన్ వెళ్లి.. మాట్లాడతానని అన్నారు! ఇప్పటికే రష్యా – ఉక్రెయిన్ వార్ ఆపడం కోసం టర్కీ వెళ్లినట్లు తెలిపారు! అయితే పాల్ ఫోన్ కాల్స్ మహిమో ఏమో కానీ.. పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నుంచి ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు భారత్ డీజీఎంవో కు ఫోన్ వెళ్లింది.. యుద్ధం ఆగింది.
ఈ సందర్భంగా స్పందించిన కేఏ పాల్... తొలుత భారత్ - పాక్ ఉద్రిక్తల విషయంలో తన పాత్ర ఉండబోదని అమెరికా చెప్పినా.. తాను తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు వివరించారు. తొలుత అమెరికా కల్పించుకోకపోయినా ఇరు దేశాల మధ్య యుద్ధం జరగకుండా ఉండటానికి పగలనక, రాత్రనక పనిచేస్తూనే ఉన్నట్లు తెలిపారు.
ఇరు దేశాల నేతలతోనూ చర్చలు జరిపినట్లు తెలిపారు. యుద్ధం జరిగితే నష్టం తప్ప ఎవరికీ ప్రయోజనం ఉండదని కేఏ పాల్ స్పష్టం చేశారు. దీంతో.. పాల్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు! సరిహద్దుల్లో నిప్పుల కొలిమి ఆరడం వెనుక పాల్ వంటి అకాల వర్షమే కారణమని నొక్కి చెబుతున్నారు!
ఇదే సమయంలో... పగలనక రాత్రనక భారత్ - పాక్ మధ్య యుద్ధం ఆపడానికి మా కేఏ పాల్ ప్రయత్నిస్తే... అది తన గొప్పతనమే అని ట్రంప్ & కో క్లెయిమ్ చేసుకోవడంపైనా ఆయన అభిమానులు మండిపడుతున్నారు! తమ నాయకుడిని ఇంకెంతకాలం తొక్కుతారో తొక్కండంటూ నిప్పులు చెరుగుతున్నారు! ఈ వీకెండ్ రోజున విచారం వ్యక్తం చేస్తున్నారు!