యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ ట్విస్ట్.. డైరీలో దాగిన దేశ భద్రత రహస్యాలు
ఇటీవల గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా తన సోషల్ మీడియా ఖాతాల్లో పాకిస్తాన్ పర్యటనలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసిన తర్వాతే వార్తల్లోకి వచ్చింది.
By: Tupaki Desk | 21 May 2025 1:13 PM ISTఇటీవల గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా తన సోషల్ మీడియా ఖాతాల్లో పాకిస్తాన్ పర్యటనలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసిన తర్వాతే వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె డైరీలో లభ్యమైన కొన్ని పేజీలు ఈ కేసులో ఊహించని మలుపు తిప్పుతున్నాయి. ఈ వివరాలు దర్యాప్తు సంస్థలను కూడా దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) జ్యోతి మల్హోత్రా కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె డైరీలోని రెండు పేజీలు సంచలన వివరాలను వెల్లడిస్తున్నాయి. ఈ పేజీల్లో ఆమె పాకిస్తాన్లో గడిపిన 10 రోజుల పర్యటనకు సంబంధించిన కీలక సమాచారం ఉందని తెలుస్తోంది. అయితే ఈ డైరీలోని ఎంట్రీలు ఆమె పాకిస్తాన్ పర్యటనకు సంబంధించినవి మాత్రమేనా, లేక గూఢచర్య కార్యకలాపాలకు సంబంధించిన కోడ్వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
డైరీలోని తేదీ లేని ఒక పేజీలో జ్యోతి మల్హోత్రా ఇలా రాసింది: "ఈ రోజు నేను పాకిస్తాన్లో 10 రోజుల పర్యటన ముగించుకుని, నా దేశమైన భారతదేశానికి తిరిగి వచ్చాను. ఈ పర్యటనలో నాకు పాకిస్తాన్ ప్రజల నుంచి ఎంతో ప్రేమ లభించింది. మా శ్రేయోభిలాషులు మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదు." ఈ వ్యాఖ్యలు ఒక సాధారణ యాత్రికురాలి అనుభవాలా, అసలు ఆమెకు పాకిస్తాన్లోని 'శ్రేయోభిలాషులు' ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జ్యోతి మల్హోత్రా తన డైరీలో పాకిస్తాన్ను రంగులమయంగా అభివర్ణించింది. అక్కడి తన అనుభవాలను మాటల్లో వర్ణించలేనని పేర్కొంది. అయితే, డైరీలోని మరికొన్ని ఎంట్రీలు ఆమె పాకిస్తాన్ అధికారులకు చేసిన ఒక అభ్యర్థన వివరాలను తెలియజేస్తున్నాయి. ఆమె ఇలా రాసింది "పాక్లోని దేవాలయాలను కాపాడండి. 1947లో విడిపోయిన కుటుంబాలను భారతీయులతో కలవనివ్వండి." అని పేర్కొంది.
ఈ వ్యాఖ్యలు ఆమె 'ట్రావెల్ విత్ జో' యూట్యూబ్ ఛానెల్లో మత సామరస్యం, మానవతా దృక్పథం గురించి మాట్లాడిన విధానాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే, ఒక గూఢచర్యం కేసులో ఈ విధమైన సున్నితమైన అంశాలను ప్రస్తావించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ఇది దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నమా, లేక నిజంగానే ఆమె గూఢచర్యం ఆరోపణల వెనుక ఇంకేదైనా కోణం ఉందా అని దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను మే 16న అధికారులు అరెస్టు చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహితలోని (Bharatiya Nyaya Sanhita) వివిధ విభాగాల కింద కేసులు నమోదు చేశారు. ఆమె యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోల్లో పాకిస్తాన్లోని వ్యూహాత్మక ప్రదేశాలు, సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
ఆమె పాకిస్తాన్ పర్యటనలకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమె పాక్లో ఎవరెవరిని కలిసింది? ఆమెకు భారత్, పాకిస్తాన్లోని కొన్ని వర్గాలతో ఉన్న సంబంధాలు ఏమిటి? అనే విషయాలపై ఎన్ఐఏ, ఐబీ దృష్టి సారించాయి. డైరీలో లభ్యమైన వివరాలు ఈ కేసులో మరిన్ని కొత్త ఆధారాలను వెలికితీయడానికి సహాయపడతాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించినది కాబట్టి, అత్యంత గోప్యంగా, సమగ్రంగా దర్యాప్తు జరుగుతోంది.