'జువ్వలదిన్నె' పాలిటిక్స్.. వైసీపీకి ప్లస్సా-మైనస్సా..?
నెల్లూరు జిల్లాలోని తీరం వెంబడి ఉన్న జువ్వలదిన్నె హార్బర్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మా ర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది.
By: Garuda Media | 17 April 2026 6:06 PM ISTనెల్లూరు జిల్లాలోని తీరం వెంబడి ఉన్న జువ్వలదిన్నె హార్బర్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మా ర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది. ఈ హార్బర్లో 30 శాతం వాటాను ప్రైవేటు డిఫెన్సు కంపెనీకి ప్రస్తుత ప్రభుత్వం లీజుకు ఇస్తోంది. తద్వారా.. ఇక్కడ మత్స్యకారులకు ఉపయోగపడేలా .. మెకనైజ్డ్ బోట్లను తయారు చేయాలని.. భావిస్తోంది. దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. అయితే.. ఇక్కడ మత్స్యకారులు దీనిని వ్యతిరేకిస్తున్న మాట వాస్తవం.
ఈ క్రమంలో ఇటీవల తమిళనాడుకు చెందిన జాలర్లు.. తమ అధునాతన బోట్లను తీసుకువచ్చి.. ఇక్కడ వేట సాగించడం మత్స్యకారులకు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతోమెరైన్ సహా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మత్స్యకారులే తమిళనాడుకు చెందిన బోట్లను పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. కానీ.. వారు అప్పగించిన నాలుగు బోట్లలో తెల్లారే సరికి రెండు బోట్లు మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై మత్స్యకార గ్రామాల వాసులు మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాల క్రమంలోనే జగన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. దీనిని రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని భావించిన మత్స్యకారులు.. జగన్ పర్యటనకు, ఆయన సభలకు ఎవరూ వెళ్లరాదని.. వెళ్లిన వారికి లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని దండోరా వేశారు. ఫలితంగా.. మత్స్యకారులు జగన్ పర్యటనకు దూరంగా ఉండిపోయారు. ఇక, జగన్ తన హయాంలోనే దీనిని పూర్తి చేశామని చెప్పారు. ప్రధాని దీనిని జాతికి కూడా అంకితం చేవారని పేర్కొన్నారు.
అయితే.. ఇదేమీ ఫలించినట్టుగా కనిపించలేదు. ప్రస్తుతం తమకు తక్షణ ఉపశమనం కావాలని.. రెండు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లీజును రద్దు చేయడంతోపాటు.. తమిళ జాలర్లు తమ ప్రాంతంలో వేట సాగించకుండా అడ్డుకోవాలని ఇక్కడి వారు కోరుతున్నారు.ఈ రెండు విషయాలను వైసీపీ అధినేత పక్కన పెట్టి.. తన హయాంలో జరిగిన పనులను మాత్రమే వివరించారు. ఫలితంగా ఆయన చేసిన రాజకీయం పెద్దగా సక్సెస్ కాలేదు.
