జూపల్లి వర్సెస్ వేముల.. స్టేజ్పైనే వాగ్వాదం!
ఈ క్రమంలో తాజాగా గురువారం.. నిజామాబాద్ జిల్లాలోని భీంగల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తల నుంచి భారీ సెగ తగిలింది.
By: Tupaki Desk | 17 April 2025 9:40 AMతెలంగాణలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్పై సూటి పోటి విమర్శలతో బీఆర్ ఎస్ నాయకులు, బీఆర్ ఎస్ తప్పులను ఎండగడుతూ.. కాంగ్రెస్ నాయకులు వాగ్యుద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గురువారం.. నిజామాబాద్ జిల్లాలోని భీంగల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తల నుంచి భారీ సెగ తగిలింది.
`కల్యాణ లక్ష్మి` పథకం కింద లబ్దిదారులైన వారికి చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెక్కులు పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడేందుకు మైకు తీసుకున్న సమయంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. తొలుత పోలీసులు వద్దని వారించినా.. ఆయన వారిని లెక్క చేయకుండా.. నేరుగా స్టేజ్ ఎక్కి.. మంత్రి చేతిలోని మైకు లాక్కున్నారు. ఏం చేశారని.. డబ్బా కొట్టుకుంటున్నారు? అని ప్రశ్నించారు.
మహిళలకు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని వేముల ప్రశ్నించారు. అంతేకాదు.. ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు చేసి.. దొడ్డిదారిలో ప్రజలను వశం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ ఎస్ డౌన్ డౌన్ అంటూ.. నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు.. వేముల వర్గీయులు కూడా అక్కడకు చేరుకుని మంత్రి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే.. వేముల విమర్శలకు జూపల్లి కూడా ఘాటుగానే స్పందించారు. బీఆర్ ఎస్ ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అందరూ కలిసి చేసిన అప్పునకు సరిసమానంగా పదేళ్లలో కేసీఆర్ అప్పులు చేశారని..రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారని ఎదురుదాడి చేశారు. ఓ సందర్భంలో వీరి వాగ్వాదం శృతి మించడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పి.. వేములను అక్కడ నుంచి పంపేశారు.