Begin typing your search above and press return to search.

పాపం జేసీ దివాకర్...వారసుడికి సీటెక్కడంటే...?

By:  Tupaki Desk   |   4 Sep 2023 1:30 AM GMT
పాపం జేసీ దివాకర్...వారసుడికి సీటెక్కడంటే...?
X

అనంతపురం జిల్లా అంటే జేసీ దివాకర్ రెడ్డి గుర్తుకు వస్తారు. 1978 నుంచి రాజకీయాల్లో ఆయన ఉన్నారు. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసి సీఎం పోస్ట్ దాకా వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ జమానాలో జిల్లాను ఒక్క లెక్కన శాసించారు. ఆయన కనుసన్నలలో అంతా జరిగిపోయేది. విభజనా తరువాత కాంగ్రెస్ పని ఏపీలో అయిపోవడంతో జేసీ బ్రదర్స్ టీడీపీలోకి జంప్ అయ్యారు.

అలా 2014లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం నుంచి ఎంపీగా ఆయన తమ్ముడు జేసీ ప్రభాకరరెడ్డి వారి సొంత సీటు తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా అయిదేళ్ల పాటు హవా చలాయించారు. 2019లో మొత్తం రాజకీయ జాతకం తిరగబడింది. జేసీ బ్రదర్స్ తమ వారసులను బరిలోకి దించారు. వారిని రాజకీయంగా గెలిపించి తాము విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు.

అలా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిని అనంతపురం ఎంపీగా, ప్రభకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్లతో పోటీకి నిలబెట్టారు. అయితే జగన్ వేవ్ లో వారసులు ఇద్దరూ ఓటమి చవిచూశారు. ఇక మళ్లీ ఎన్నికలు వస్తున్న వేళ జేసీ బ్రదర్స్ కి టీడీపీలో టికెట్ల ఇక్కట్లు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు.

చంద్రబాబు ఈసారి అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అని చెప్పేసారు అని ప్రచారం లో ఉన్న మాట. అది కూడా తాడిపత్రికే అని అంటున్నరు. అలా కనుక చూసుకుంటే అక్కడ జేసీ ప్రభాకరరెడ్డి కానీ ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి కానీ పోటీ చేస్తారని అంటున్నారు. మరి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి అనంతపురం టికెట్ ఇస్తారా అన్నదే డౌట్ గా ఉంది. అయితే ఒక్కటే టికెట్ అన్నట్లుగా చెప్పకనే చెప్పేశారు అని అంటున్నారు

దానికి సంకేతాలుగా అనంతపురం ఎంపీ సీటుకు ఇంచార్జిగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుని చాలా కాలం క్రితమే చంద్రబాబు నియమించేశారు అని అంటున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలో పార్టీ పనులు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు అని అంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుని ఎంపీగా దించాలని టీడీపీ భావిస్తోంది. బీసీ కార్డుతోనే 2019 ఎన్నికల్లో వైసీపీ ఈ సీటుని సొంతం చేసుకుంది. రంగయ్య వైసీపీ ఎంపీగా గెలిచారు.

దాంతో టీడీపీ కూడా బీసీలకే ఈ సీటు ఇవ్వాలని చూస్తోంది. దాంతో జేసీ బ్రదర్స్ కి చుక్కెదురు అవుతోంది అని అంటున్నారు. మరీ ముఖ్యంగా జేసీ పవన్ కి పోటీ చేసేందుకు సీటు లేకుడా పోయింది అని అంటున్నారు. దాంతో ఈ పరిణామాల పట్ల నిశితంగా పరిశీలన చేస్తున్న పెద్దాయన జేసీ దివాకర్ రెడ్డి ఏమి ఆలోచిస్తారో అన్న చర్చ అయితే మొదలైంది.

ఇంకో వైపు చూస్తే తాడిపత్రి సీటులో జేసీ అస్మిత్ రెడ్డికి బదులుగా జేసీ ప్రభాకరరెడ్డిని పోటీ చేయమని టీడీపీ అధినాయకత్వం కోరుతోంది అని అంటున్నారు. తాడిపత్రి సీటు చాలా ఇంపార్టెంట్ ని రిస్క్ చేయలేమని చెప్పినట్లుగా అంటున్నారు. దాంతో జేసీ బ్రదర్స్ వారసులకు పోటీకి సీట్లు లేవా అన్నది జిల్లాలో పెద్ద ఎత్తున చర్చగా సాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జేసీ బ్రదర్స్ వారసుల కోసమే ఏడున్నర పదుల వయసులో రాజకీయాల్లో ఇంకా కొనసాగుతున్నారు అని అంటున్నారు.