Begin typing your search above and press return to search.

పోరాడి గెలిచిన జ‌న‌సేన‌.. 'గాజు గ్లాసు' ద‌క్క‌డం వెనుక!!

దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు ఏ ఎన్నిక జ‌రిగిన గుర్తు కోసం పోరాడే ప‌రిస్థితి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   16 April 2024 4:03 PM GMT
పోరాడి గెలిచిన జ‌న‌సేన‌.. గాజు గ్లాసు ద‌క్క‌డం వెనుక!!
X

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ కూట‌మితో క‌లిసి త‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మొత్తం 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు స్థానాల్లో ఈ పార్టీ పోటీ చేస్తోంది. దీనికి సంబంధించిన అభ్య‌ర్థుల‌ను కూడా ఖ‌రారు చేసింది. అయితే.. చిక్క‌ల్లా ఎన్నిక‌ల గుర్తు ద‌గ్గ‌రే వ‌చ్చింది. వాస్త‌వానికి జ‌న‌సేన‌కు `గాజు గ్లాసు` గుర్తు ఉంది. అయితే.. ఇది టీడీపీకి ఉన్న `సైకిల్‌` మాదిరిగా ప‌ర్మినెంట్ ఎన్నిక‌ల గుర్తు కాదు. ఎందుకంటే.. జ‌న‌సేన పార్టీ శాశ్వ‌త గుర్తింపు ఉన్న పార్టీ కాదు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు ఏ ఎన్నిక జ‌రిగిన గుర్తు కోసం పోరాడే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో ఏపీలోనూ గాజు గ్లాసు గుర్తు కోసం పోరాడి గెల‌వాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది. రిజిస్ట‌ర్డ్ పార్టీల‌కు ఉన్న ప‌రిస్థితి ఎలా ఉన్నా.. గుర్తింపు లేని పార్టీలు.. ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు కోసం అప్ల‌యి చేయాల్సిన ప‌రిస్తితి ఉంది. ఇలానే గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్త‌ల కోసం ప్ర‌క‌ట‌న ఇచ్చింది. అయితే.. ఎవ‌రు ముందుగా వ‌స్తే.. వారికే గుర్తును కేటాయించే ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలో గాజు గ్లాసు గుర్తును ఎవ‌రైనా వ‌చ్చి ముందుగా కోరుకుంటే.. ఫ్రీసింబ‌ల్‌గా ఉన్న దీనిని ఎవ‌రికైనా కేటాయించే అవ‌కాశం ఉంది.

ఇక్క‌డే జ‌న‌సేనకు ఇబ్బంది ఏర్ప‌డింది. గ‌త ఏడాది డిసెంబ‌రు 12 ఎన్నిక‌ల సంఘం గుర్తుల కోసం పిలుపునివ్వ‌గా.. జ‌న‌సేన ముందుగానే వెళ్లి గాజు గ్లాసు కోసం ద‌ర‌ఖాస్తు చేసింది. ఈ ఒక్క విష‌యంలో తొంద‌ర ప‌డింది కాబ‌ట్టే ఇప్పుడు ఆగుర్తు పార్టీకి ద‌క్కింది. అయితే.. ఈ విష‌యంలోనూ శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఎందుకంటే.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ గుర్తు కోసం ద‌ర‌ఖాస్తు చేసింది. అయితే.. ఈ రెండు ద‌ర‌ఖాస్తుల మ‌ధ్య కొంత గ్యాప్ రావ‌డం, జ‌న‌సేన ముందుగా వెళ్ల‌డంతో ఎన్నిక ల‌సంఘం ఈ గుర్తును జ‌న‌సేన‌కు కేటాయించింది. అయితే.. తామే ముందు వ‌చ్చామంటూ.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టుకు వెళ్లింది.

ఈ క్ర‌మంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ తరఫున న్యాయవాది ఎంవీ రాజారామ్‌ వాదనలు వినిపించారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించిందన్నారు. జనసేన తరఫున సీనియర్‌ న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయింపు జరిగిందన్నారు. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌, న్యాయవాది శివదర్శిన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘జనసేన’ ముందుగా దరఖాస్తు చేసుకుందని తెలిపారు. అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు ఫ్రీ సింబల్‌ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఇదే క‌లిసి వ‌చ్చింది!

గత డిసెంబరు 12న తాము దరఖాస్తుల ఆహ్వానాన్ని ప్రారంభించగా అదేరోజు జనసేన దరఖాస్తు చేసింది. పిటిషనర్‌ పార్టీ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌) డిసెంబరు 20న దరఖాస్తు చేయగా అది 26న అందింది. దీంతో జ‌న‌సేన‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రీ య ప్ర‌జా కాంగ్రెస్ పార్టీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. గాజు గ్లాసు గుర్తును జ‌న‌సేన‌కే కేటాయిస్తూ. .కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాన్ని కోర్టు స‌మ‌ర్థించింది. దీంతో జ‌న‌సేన ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయ‌నుంది.