జనసేనలో చేరికలు ఎందుకు లేవు ?
ఏపీలో టీడీపీ కూటమిలో రెండవ పెద్ద పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఉన్నారు.
By: Tupaki Desk | 7 May 2025 3:15 AMఏపీలో టీడీపీ కూటమిలో రెండవ పెద్ద పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఉన్నారు. జనసేన అధినేత పవన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. చంద్రబాబుతో పాటుగా సమాన గౌరవం పొందుతున్నారు. ఇక చూస్తే ఒక బలమైన సామాజిక వర్గం వెన్ను దన్ను జనసేనకు ఉందన్నది తెలిసిందే.
పవన్ కి ఉన్న సినీ గ్లామర్ తో యువత మహిళకు సామాజిక సమీకరణలకు అతీతంగా జనసేన పట్ల అభిమానం చూపిస్తున్నారు. ఇలా బలమైన నేపధ్యం కలిగిన పార్టీని అధికారంలో ఉండగా విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 21 సీట్లు తప్ప మిగిలిన వాటిలో జనసేన ప్రాతినిధ్యం లేదు. అలాంటపుడు చేతిలో ఉన్న అధికారంలో ఆయా చోట్ల పార్టీని పటిష్టం చేయడానికి ఇదే సరైన తరుణం అని అంతా అంటున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పైగా వైసీపీ నుంచి ఎంతో మంది జనసేనలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలా వచ్చిన వారిని దగ్గరకు తీసుకుని పార్టీని బలంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
అయితే జనసేనలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు అని అంటున్నారు. పార్టీలో కొత్త వారు వస్తే మరిన్ని గొడవలు వస్తాయని వర్గ పోరు హెచ్చుతుందని విభేదాలతో ఇబ్బందులు పడతామని ఏవో ఆలోచనలతో అధినాయకత్వం ఉందని అంటున్నారు. అందువల్లనే జనసేనలో చేరాలని చూసిన వారు కూడా టీడీపీలోకి వెళ్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే జనసేనలో చేరిన కీలక నేతలు కూడా అక్కడ ఇమడలేకపోతున్నారు అని అంటున్నారు. పార్టీలో చేరినపుడు కండువా కప్పడం తప్పించి పవన్ తో దర్శన భాగ్యం మళ్ళీ దొరకడం లేదు అని అంటున్నారు. వైసీపీలో జగన్ విషయంలో ఏ రకమైన సమస్య ఉందో అదే జనసేనలోనూ ఉందని అంటున్నారు. పైగా పార్టీలో తమకు గుర్తింపు ప్రాధాన్యత లేదని భావిస్తునారు.
ఈ విషయం తెలిసి రావాలని చూస్తున్న వారు కూడా ఆగిపోతున్నారు అని అంటున్నారు. మరి జనసేన విస్తరించుకుని 2029 ఎన్నికల్లో కనీసంగా 50 నుంచి 60 స్థానాలకు అయినా పోటీ పడాలని అనుకుంటోందా అన్నది కూడా సందేహంగా ఉంది. అలా అనుకుంటే కనుక ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలి కదా అని కూడా అంటునారు. ఉత్తరాంధ్రా ఉభయగోదావరి జిల్లాలలో జనసేనకు బలం ఉంది.
అలాగే కోస్తా జిల్లాలలో కూడా కాపులు పోలరైజ్ అయి జనసేన వైపు ఆశగా చూస్తున్నారు. కానీ జనసేనలోనే ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు అని అంటున్నారు. అందుకే చేరికలకు బ్రేక్ పడుతోంది అని అంటున్నారు. మరి ఇదే రకమైన తీరు కనబరిస్తే మాత్రం జనసేన అలాగే ఉండిపోతుందా అన్న డౌట్లూ కూడా హితైషులలో వస్తున్నాయట.