Begin typing your search above and press return to search.

వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్‌ మీట్ @ భీమిలి... దిశానిర్దేశం చేయనున్న జగన్

ఇందులో భాగంగానే ఈ నెల 23న భీమిలిలో ఇన్ ఫ్లూయెన్సర్ లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

By:  Tupaki Desk   |   22 April 2024 9:54 AM GMT
వైసీపీ సోషల్  మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్‌ మీట్ @ భీమిలి... దిశానిర్దేశం చేయనున్న జగన్
X

సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి వారి వ్యక్తిగత టాలెంట్ తో వీక్షకులపై వీరి ప్రభావం కీలకంగా ఉంటుంది. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్‌ ఫ్లుయెన్సర్స్ అనే సంగతి తెలిసిందే!

విషయం ఏదైనా.. ఎంత క్లిష్టమైనది అయినా.. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వీలైనంత క్లుప్తంగా, అంతకు మించి స్పష్టంగా వీరు సమాచారం ఇస్తారు. ఫలితంగా... ఇంటర్నెట్ యూజర్లు వీరికి ఇట్టే అభిమానులుగా మారిపోతున్నారు. సోషల్‌ మీడియాలో వీరి ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. వాళ్లు పెట్టే వీడియోలు చాలా చర్చనీయాంశమవుతుంటాయి కూడా!

ఇలా దాదాపు ప్రతీ విషయంపైనా అన్ని వర్గాలనూ ప్రభావితం చేయగలుగుతున్న ఈ సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్స్... ఇప్పుడు రాజకీయాలపైనా ప్రభావితం చూపుతున్నారు. ఎన్నికల సమయంలో వీరు పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయన్న ప్రచారం కూడా జోరుగా ఉంది. దీంతో వైసీపీ ఇందుకు సిద్ధమైంది.

అవును... "మీ ప్రభావం అనన్య సామాన్యం.. ఎల్లోమీడియా దుష్ప్రచారానికి మీరే సరైన సమాధానం.. ప్రజల్లోకి తీసుకెళ్లాలి వాస్తవాలు.. కుప్పకూలాలి తప్పుడు వార్తలు".. అంటూ ఇన్ ఫ్లుయెన్సర్ లతో ప్రచారానికి సిద్ధమైంది వైసీపీ. ఇందులో భాగంగానే ఈ నెల 23న భీమిలిలో ఇన్ ఫ్లూయెన్సర్ లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

దీంతో... ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నవారు హాజరవుతారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్... ఈ సోషల్ మీడియా కార్యకర్తలు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సోషల్ మీడియా నిర్వాహకులు... ఇన్ ఫ్లూయెన్సర్ లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఇందులో భాగంగా... పోలింగ్ తేదీ దగ్గరపడుతోన్న వేళ రానున్న ఈ కొద్దికాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని.. తన పాలనలో సాధించిన విజయాలు, ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, పేదలకు దక్కిన సంక్షేమం, వారికి లభించిన రాజకీయ, సామాజిక ప్రాధాన్యం.. మొదలైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలా కృషి చేయాలన్నది ఈ సమావేశంలో జగన్ దిశా నిర్దేశం చేస్తారు.

ఇదే క్రమంలో... టీడీపీ, దాని అనుబంధ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని సంపూర్ణంగా తిప్పికొట్టడం, ప్రభుత్వం నుంచి జరిగిన మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే విషయంలో అంతా ఐక్యంగా నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఒక గొప్ప వేదిక కానుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇన్ ఫ్లుయెన్సర్ లు, వైసీపీ సోషల్ మీడియా శ్రేణులూ పెద్ద ఎత్తున హాజరవుతారని అంటున్నారు.