Begin typing your search above and press return to search.

విపక్షానికి అందనంత దూరంలో జగన్....!

ఇక్కడే అంతా పప్పులో కాలేస్తున్నారు. పార్టీని అయినా నేతలను అయినా అధికారంలో తెచ్చేది జనం.

By:  Tupaki Desk   |   13 Jan 2024 3:36 AM GMT
విపక్షానికి అందనంత దూరంలో జగన్....!
X

జగన్ పాలిటిక్స్ ఎవరికీ అర్థం కాదు. ఆ మాటకు వస్తే దశాబ్దాలుగా ట్రెడిషనల్ పాలిటిక్స్ చూస్తూ వస్తూ వాటినే విశ్లేషిస్తున్న వారికి కూడా ఒక పట్టాన బోధపడడంలేదు. ఈ దేశంలో పాలిటిక్స్ అంతా ఒక్క తీరున సాగుతాయి. పార్టీ చుట్టూ తిరుగుతాయి. పార్టీ వారికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనుకుని రాజకీయాలు చేయడమే అధినేతలు చేస్తున్న పని.

ఇక్కడే అంతా పప్పులో కాలేస్తున్నారు. పార్టీని అయినా నేతలను అయినా అధికారంలో తెచ్చేది జనం. అందువల్ల జనం కోణం నుంచి పాలిటిక్స్ చేయడం అన్నది ఒక కొత్త విధానం. అయితే దీన్ని చాలా మంది తెలుసుకున్నా ఆచరణలో మాత్రం పెద్దగా అనుసరించరు. పార్టీ గట్టిగా ఉంటే చాలు అనుకుంటారు.

పార్టీ ఉండాలి అలాగే జనంతో పార్టీ అనుసంధానం కావాలి. జనమే పార్టీని ప్రభుత్వాన్ని శాసించాలి. ఇది జగన్ మార్క్ పాలిటిక్స్. అందుకే ఆయన జనంతోనే కనెక్ట్ అవుతున్నారు. జనం మాటే వింటున్నారు. జనం చెప్పినదే చేస్తున్నారు. జగన్ సీఎం గా ఉంటూ అభ్యర్థుల ఎంపిక చకచకా కానిచ్చేస్తున్నారు.

ఈ రోజున జగన్ తాడేపల్లిలో ఉంటూ అభ్యర్ధుల కసరత్తు చేస్తున్నారు అని తేల్చేస్తున్నారు అని అంతా అనుకోవచ్చు కానీ జగన్ ఈ ప్రక్రియ విపక్షాల కంటే చాలా ముందే చేపట్టారు ఆయన గడప గడప అన్నారు. ప్రజలకు చేరువ కమ్మన్నారు. వర్క్ షాప్స్ పెట్టారు. ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు జనం నుంచి ఫీడ్ బ్యాక్ ని తెప్పించుకుంటూ వచ్చారు.

అలా అనేక వైపుల నుంచి తెచ్చి పెట్టుకున్న సమాచారం సర్వేలు ఆధారంగానే ఆయన ప్రతీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నారు. సాధారణంగా అధినాయకుడు తమ పార్టీ వారు ఇచ్చిన నివేదికలను ఎక్కువగా నమ్ముతారు. అది సహజమే, మంచి పరిణామమే అనుకున్నా వాటి కంటే ఎక్కువగా జనం వైపు నుంచి కూడా చూడాల్సి ఉంది.

అదే జగన్ ఇపుడు చేస్తున్నారు. ఆయన పాలిటిక్స్ అంతా చాణక్య నీతిని తలపిస్తోంది. నిర్ణయం తీసుకున్నపుడు తనవాడు పరవాడు అన్న తేడా చూడవద్దు లక్ష్యం వైపే చూడు అన్న చాణక్య నీతినే జగన్ అనుసరిస్తున్నారు. అందుకే ఆయన అంత దమ్ముగా తన ఎమ్మెల్యేలతో మూడవ వంతు మందిని మార్చేయగలిగారు ఇంకా మార్పు చేర్పులు కూడా చేయనున్నారు.

ఇక ఇది ఈ రోజుకు వింత కొత్త అనిపించినా ఇదే న్యూ ట్రెండ్ అన్నది జగన్ పాలిటిక్స్ తెలియచేయబోతోంది అని అంటున్నారు. ఇక చాలా మంది పార్టీ నుంచి వెళ్తూ సీఎం తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎక్కువ సేపు తమతో ఉండలేదని చెబుతూ వచ్చారు. కానీ జగన్ మార్క్ పాలిటిక్స్ లో అది కాదు విధానం. ఏ ప్రజా ప్రతినిధి అయినా ఉండాల్సింది ప్రజలలో, అపాయింట్మెంట్స్ ప్రజలకే ఇవ్వాలి. వారి నుంచే తీసుకోవాలి.

అక్కడ మార్కులు పడితేనే పార్టీ అయినా నేత అయినా గెలిచినట్లు. ఇక ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో తమకు క్రెడిట్ ఎలా వస్తుంది అని చాలా మంది అంటూంటారు. కానీ తమ ప్రభుత్వం అయినపుడు పధకం తమ చేతుల మీదుగా ఇవ్వకపోతే ఏమి పోయింది. ఫలాలు అందిన ప్రజలు ఆయా ఎమ్మెల్యేలను ఆ ప్రభుత్వం తరఫునే గుర్తిస్తారు కదా. ఇది జగన్ థియరీ.

ఇక ఒక విధంగా చెప్పాలీ అంటే జగన్ ఎమ్మెల్యేలకు చాలా తలనొప్పులు తప్పించారు. వారు ప్రతీ పధకం గురించి ఆలోచించి లబ్దిదారులను ఎంపిక చేసి ఇస్తూ పోతూంటే కొందరికి అందరివారు ఉంటారు. వారు ఎటూ శత్రువులు అవుతారు. అలాంటి బాధ లేకుండా వయా మీడియాగా వ్యవస్థను రూపొందించారు. ఆ పధకాలు జనాలకు సరిగా అందుతున్నాయో లేదో చూడడమే ఎమ్మెల్యేల పనిగా ఆయన చెబుతూ వచ్చారు.

మొత్తానికి జగన్ చెప్పినది ఆచరించిన వారికి సీట్లు వస్తున్నాయి. లేని వారికి సీట్లు చిరుగుతున్నాయి. ఈ విధానం ఇలా ఉంటే ఎన్నికల కంటే చాలా ముందుగా తన అభ్యర్థులను ప్రకటించేసి జనంలోకి వెళ్ళి రానున్న రెండు నెలలు జనంలో ఉండాలని జగన్ భారీ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. జనాలకు ఎవరైతే తొందరగా రీచ్ అవుతారో వారి పట్ల పాజిటివిటీ పెరుగుతుంది. అది ఎన్నికల్లో భారీగా ప్లస్ అవుతుంది.

అలా కాకుండా చివరి నిముషం దాకా అభ్యర్ధి తేలక ఎన్నికల్లో ఆఖరి పది రోజుల ప్రచారం వల్ల ఉపయోగం ఉండదు. జనాలు కూడా వారిని గుర్తుపట్టడం కష్టం అవుతుంది. అందుకే జగన్ తొందరగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసేసి సంక్రాంతి తరువాత జనంలోకి వస్తున్నారు. అదంతా ఎన్నికల ప్రచారం చివరి ఘడియ దాకా కొనసాగిస్తారు. మొత్తానికి జగన్ రాజకీయ వ్యూహాల్లో చాలా ముందున్నారు. మరి విపక్షం దీన్ని ఎలా చూస్తుందో ఆలోచించాల్సిందే.