Begin typing your search above and press return to search.

ఆపరేషన్ కూటమి : జగన్ బస్సు యాత్రలో భారీ చేరికలు...!?

ఈ బస్సు యాత్రలో ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం పూర్తి స్థాయిలో మారిపోతుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 March 2024 12:35 PM GMT
ఆపరేషన్ కూటమి : జగన్ బస్సు యాత్రలో భారీ చేరికలు...!?
X

ఏపీలో వైఎస్ జగన్ బస్సు యాత్ర ఈ నెల 27 నుంచి మొదలు కాబోతోంది. ఆయన తాడేపల్లి నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లి అక్కడ తన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ చాలా రోజుల తరువాత జనంలోకి వస్తున్నారు.

ఆయన అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి మొదటివారంలో కర్నూల్ వచ్చారు. ఆ తరువాత ఈ నెల 10న సిద్ధం సభను దక్షిణ కోస్తాలో నిర్వహించారు. ఈ రెండూ తరువాత ఎన్నికల కోడ్ వచ్చేసింది. దాంతో గత పది రోజులుగా జగన్ క్యాంప్ ఆఫీసు దాటి బయటకు రాలేదు. ఆయన ఇపుడు బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

ఈ బస్సు యాత్ర ఏకంగా 21 రోజుల పాటు ఏపీ అంతటా సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తప్పించి మిగిలిన 21 చోట్ల ఈ బస్సు యాత్ర సాగనుంది అని అంటున్నారు. ఈ బస్సు యాత్ర రాయలసీమలో మొదలెట్టి ఉత్తరాంధ్రా చివరన అయిన ఇచ్చాపురంలో ముగిస్తారు.

ఈ పాదయాత్రలో ఉదయం వివిధ వర్గాలతో అధినేత మమేకం కావడం అవుతారు.వారి నుంచి అభిప్రాయాలు ప్రభుత్వ పాలన మీద వారి స్పందనను తెలుసుకుంటారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత మధ్యాహ్నం తరువాత పార్టీ నేతలతో మీటింగ్స్ ఉంటాయని అంటున్నారు. సాయంత్రం బహిరంగ సభ ఉంటుందని రాత్రి ఆ నియోజకవర్గంలోనే బస ఉంటుందని చెబుతున్నారు.

ఇక ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గంలో బస్సు యాత్ర సందర్భంగా ఆయన చోట్ల ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిని కూడా సమీక్షిస్తారు అని అంటున్నారు. అదే విధంగా అభ్యర్ధుల ఎన్నికల ప్రచారం గురించి ఆరా తీయడం వారికి సలహా సూచనలు ఇవ్వడం చేస్తారు. అదే సమయంలో ప్రత్యర్ధి బలాలు బలహీనతల మీద ఆరా తీస్తారని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఈ బస్సు యాత్రలో అతి ముఖ్య ఘట్టం కూడా ఉంది అని అంటున్నారు. కూటమిలో లుకలుకలు ఉన్నాయి. తీవ్ర స్థాయిలొ అసంతృప్తులు ఉన్నాయి. వాటితో చాలా మంది నేతలు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారు. వారిని వైసీపీ వైపు తిప్పుకోవడంతో పాటు వారికి పార్టీ జెండాలు కప్పి వైసీపీ గూటిలోకి తీసుకుని రావడం అతి ముఖ్యమైన అజెండా అని అంటున్నారు

ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో కూటమిలోని టీడీపీ జనసేన వంటి పార్టీలలో ఉన్న అసంతృప్త నేతల జాబితాను వైసీపీ రెడీ చేసి పెట్టుకుందని అంటున్నారు. జగన్ బస్సు యాత్ర ఆయా నియోజకవర్గాలకు వెళ్లినపుడు వారు పార్టీలో చేరుతారు అని అంటున్నారు ఇదిలా ఉంటే ఈసారి ఎక్కువగా ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలల మీద వైసీపీ ఫోకస్ పెట్టింది.

ఆయా చోట్ల వైసీపీ విజయాన్ని పటిష్టం చేయడానికి ప్రత్యధులను బలహీనం చేయడానికి ఈ చేరికలు ఉపకరిస్తాయని అంటున్నారు. ఏలూరుకి చెందిన ఒక మాజీ ఎంపీ మాజీ మంత్రి టీడీపీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఆయన జగన్ బస్సు యాత్రలో భాగంగా పార్టీలో చేరుతారు అని అంటున్నారు. అదే విధంగా మరో వైపు చూస్తే దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో కొంతమంది బిగ్ షాట్స్ ని వైసీపీలో చేర్చుకుంటారు అని అంటున్నారు.

మొత్తం మీద ఏపీలో వైసీపీకి అనుకూల గాలిని వీచేలా చేయడానికి జగన్ బస్సు యాత్రను స్టార్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఈ బస్సు యాత్రలో ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం పూర్తి స్థాయిలో మారిపోతుందని అంటున్నారు. ఏపీలో విపక్షాల కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ధాటీగా మొదలెట్టడం ద్వారా పొలిటికల్ అడ్వాంటేజ్ ని కూడా సొమ్ము చేసుకోవాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు. ఇక జగన్ బస్సు యాత్ర సందర్భంగా విపక్షాల మీద వైసీపీ అధినేత హోదాలో విమర్శల జల్లులే కురిపిస్తారు అని అంటున్నారు.