Begin typing your search above and press return to search.

వైనాట్ 175... ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి "సిద్ధం"!

జగన్... వైనాట్ 175 లక్ష్యంగా సేనలను ఎన్నికల సమరానికి సిద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా భీమిలి నుంచి ఎన్నికల సమరశంఖం పూర్తిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 5:46 AM GMT
వైనాట్ 175... ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ అన్ని రకాలుగానూ సిద్ధమైపోతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పుల వ్యవహారలను చక్కబెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్... వైనాట్ 175 లక్ష్యంగా సేనలను ఎన్నికల సమరానికి సిద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా భీమిలి నుంచి ఎన్నికల సమరశంఖం పూర్తిస్తున్నారు. నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకూ పట్టు విడవకుండా గెలుపే లక్ష్యంగా నిలబడేలా క్యాడర్ కు దిశనిర్దేశం చేయనున్నారు.


అవును... "ఒకటే జననం, ఒకటే మరణం. ఒకటే గమనం ఒకటే గమ్యం! గెలుపు పొందె వరకూ.. అలుపు లేదు మనకు"! ఏపీలో వైసీపీ క్యాడర్ ఇదే లక్ష్యంతో ఉందని తెలుస్తుంది. జగన్ పరిపాలన ఎలా ఉంటుందో తెలియక ముందే 151 అసెంబ్లీ, 23 ఎంపీ స్థానాల్లో గెలుపొందిన తర్వాత... ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో.. కరోనా వంటి క్లిష్ట సమస్యలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనక్కి "తగ్గేదేలే" అన్నట్లు ముందుకుపోయే జగన్ పాలన చూసిన తర్వాత 175 + 25 పెద్ద సమస్య కాదని భావిస్తున్నారు.

ఈ ఎజెండాతోనే క్యాడర్ ని మరింత ఉత్తేజితుల్ని చేసి మళ్ళీ మరింత బలంగ అధికారంలోకి వచ్చే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరిస్తోంది. ఇందులో భాగంగా రానున్న ఎన్నికల సమరానికి సేనలను "సిద్ధం" చేయడానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి నేటి (జనవరి 27) నుంచి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచే సమరశంఖం పూరించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి భారీఎత్తున తరలివెళ్లడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు.

ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ జిల్లాలోని విశాఖపట్టణం –భువనేశ్వర్‌ జాతీయ రహదారిని ఆనుకొని తగరపువలస మూడు కోవెళ్లు ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాన్ని ఈ భారీ బహిరంగ సభకోసం ఎంపిక చేశారు. సుమారుగా 15 ఎకరాల స్థలంలో జరగనున్న ఈ భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌.. వైసీపీ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇదే సమయంలో నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా జగన్ ముఖాముఖి మాట్లాడనున్నారు.

ఇప్పటికే సామాజిక సమీకరణలు, సర్వేల ఫలితాలు, ప్రజల అభిప్రాయాలు, కార్యకర్తల సూచనల మేరకు పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను జగన్ మారుస్తున్న సంగతి తెలిసిందే. వైనాట్ 175కి ఇబ్బంది తెచ్చే, అడ్డుగా నిలిచే ఏ చిన్న సమస్యనూ జగన్ లైట్ తీసుకోవడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్‌ సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. దీంతో... గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కదనరంగంలో దూసుకుపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలోనే... పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భీమిలి బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లేందుకు నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా చూసుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ ఈ బహిరంగ సభ జరగనుంది.