కడపలో మహానాడు...జగన్ రియాక్షన్ ఇదే !
తన సొంత జిల్లా సొంత ఇలాకా అయిన కడపలో టీడీపీ మహానాడుని నిర్వహించడం పట్ల వైసీపీ అధినేత జగన్ రియాక్షన్ ఏమిటి ఎలా ఉండబోతోంది అన్నది చర్చగానే ఉంది.
By: Tupaki Desk | 28 May 2025 1:18 PMతన సొంత జిల్లా సొంత ఇలాకా అయిన కడపలో టీడీపీ మహానాడుని నిర్వహించడం పట్ల వైసీపీ అధినేత జగన్ రియాక్షన్ ఏమిటి ఎలా ఉండబోతోంది అన్నది చర్చగానే ఉంది. పైగా తెలుగుదేశం పార్టీ తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని ప్రాంతం కడప కావడం విశేషం. మరి ఇపుడే కడపలో ఎందుకు టీడీపీ నిర్వహిస్తోంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
కడప అన్నది వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ కాబట్టి అక్కడ టీడీపీ ఏ కార్యక్రమం చేపట్టినా దాని రియాక్షన్ పొలిటికల్ గా గట్టిగానే ఉంటుంది అని అంటున్నారు ఇక చూస్తే కనుక ఈసారి కడప జిల్లాలో మొత్తం పదికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచి టీడీపీ కూటమి జెండా ఎగరేసిన క్రమంలో వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయడానికి అన్నట్లుగానే మహానాడు నిర్వహించింది అని అంటున్నారు.
దానికి తగినట్లుగానే టీడీపీ అధినాయకత్వం ప్రసంగాలు సైతం ఉన్నాయని అంటున్నారు. ఈసారి కడపలో మొత్తానికి మొత్తం స్వీప్ చేస్తామని అధినేత చంద్రబాబు అంటే హోం మంత్రి అనిత కడపలో మహానాడు నిర్వహించడంలో కిక్కే వేరు అని వ్యాఖ్యానించారని అంటున్నారు ఈ నేపధ్యంలో టీడీపీ మహానాడు మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. కడపలో మహానాడు పెట్టడం గొప్ప కాదని జగన్ అన్నారు. సత్తా ఉంటే ఎన్నికల ఏళ టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కడపలో మహానాడు అన్నది పెద్ద డ్రామా అని జగన్ అభివర్ణించారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం తాము ఏమి చేసిందో చెప్పుకోలేని స్థితిలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు ప్రతీ ఇంటికీ వెళ్ళి తాము ఏమి చేసామో టీడీపీ నాయకులు ధైర్యంగా చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు మహనాడులోనే ఫోజులు ఇస్తున్నారు కానీ జనంలోకి రావాలని జగన్ కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి అడుగుతారు అన్నది తెలుసు అన్నారు. కడపలో మహానాడు పెట్టి జగన్ ని తిడితే టీడీపీ సత్తా నిరూపించుకున్నట్లా అని ఆయన నిలదీశారు. ఆ పనేదో హామీలు నెరవేర్చే విషయం మీద దృష్టి సారిస్తే బాగుంటుందని ఆయన ఫైర్ అయ్యారు.
ప్రజాస్వామ్యయుతంగా ఒక పార్టీ నుంచి నెగ్గిన వారిని ప్రలోభపెట్టి తమ పార్టీలో కలుపుకుంటూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పాలనలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినా సాకులు చూడకుండా తాము చెప్పిన హామీలను ఠంచనుగా నెరవేర్చామని ఆయన గుర్తు చేశారు. తాము 99 శాతం హామీలను నెరవేరామని అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేశామని అన్నారు.
మొత్తానికి టీడీపీ మహానాడు మీద వైసీపీ అధినేత నుంచి రావాల్సిన రియాక్షన్ వచ్చింది. ఆయన సూపర్ సిక్స్ ని గుర్తు చేస్తున్నారు. కడపలో మీటింగ్ పెట్టడం గ్రేట్ ఎలా అవుతుందని అంటున్నారు దీనికి టీడీపీ నుంచి కౌంటర్ ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.